సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

31, మార్చి 2019, ఆదివారం

మంచి ప్రజాప్రతినిథులను ఆశించడం అత్యాశే .

ఓటు హక్కు గురించీ  – దాన్ని వినియోగించుకోవడం గురించీ అనర్గళంగా ఉపన్యసిస్తున్నాడు మేధావి .
         “ ఓటు హక్కు ప్రతి పౌరునికీ రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం . పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి వ్యక్తీ ఓటరుగా నమోదు కావాలి . ప్రజాస్వామ్య సూత్రానికి ఓటు మూల స్థంభం . ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకున్న దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది . పౌరులందరూ ఎన్నికలలో విథిగా ఓటు హక్కును వినియోగించు కోవాలి ......
        సదరు మేథావికి భారత రాజ్యాంగం గురించీ - పౌరహక్కులూ విధుల గురించీ క్షుణ్ణంగా తెలుసు . మీదుమిక్కిలి ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి పరితపించే మనస్తత్వం .
       నిజమే . ఓటు హక్కు వజ్రాయుధమే . అయితే ఓటరు చేతిలో ఉన్నప్పుడు కాదు . ఓటరు చెయ్యిదాటి నేతకు చేరినప్పుడు . అవినీతికి చేరువైనప్పుడు . ఇదీ ప్రస్తుతం జరిగే ప్రజాస్వామ్య ప్రహసనం .
        రాజకీయ పార్టీలు రెండో మాట లేకుండా అంగబలం అర్థబలం ఉన్న గెలుపు గుర్రాలనే ఎన్నికల బరిలోకి    దించుతాయి .  ఎన్నిఅకృత్యాలు చేసయినా గెలవగల సత్తా ఉండడమే అభ్యర్థిత్వానికి ముఖ్య అర్హత .  అవినీతి మలికి అంటని స్వఛ్ఛత– సేవాతత్పరత , నిరాడంబరత , సంస్కారం – ఇలాంటి ట్రాక్ రికార్డు అవసరం   లేదు.  
రాజకీయ పార్టీలు ఎంపిక చేసే అభ్యర్థిత్వాలు ఇలా ఉంటే ఎవరికి ఓటెయ్యాలి . ఎవరికి ఓటేసినా అది
గెలిచిన వాడి చేతికి వజ్రాయుధాన్నిచ్చినట్టే . వాడు దాన్ని ప్రజలనూ  ప్రజాస్వామ్యాన్నీ నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నాడు . ప్రజాధనం దోచుకుంటున్నాడు .
         పూర్వం న్యాయవాద విద్యనభ్యసించిన వారే ఎక్కువగా రాజకీయాలలోకి వచ్చేవారు . రాజకీయాలలోకి వచ్చిన ఇతరత్రా వారికి కూడా ప్రజాసేవ పట్ల నిబధ్ధతా , అవినీతి ముద్ర పడుతుందేమోననే జంకూ ఉండేది . 
నేడు అధికారం కోసం నేతలు పడే తహ తహ చూస్తూ ఉంటే ఎలాంటి జంకూ గొంకూ కనబడడం లేదు . కేవలం దాహం తప్ప .
        బడా కాంట్రాక్టర్లూ , బడా పారిశ్రామిక వేత్తలూ , లిక్కర్ కాంట్రాక్టర్లూ , చివరకు గూండాలూ రౌడీలూ కిల్లర్లూ
రాజకీయ నేతల అవతారమెత్తి అధికారం కోసం తహతహలాడడం ప్రజాసేవ కోసమే అనుకోగలమా ?
దీన్ని ప్రజాస్వామ్యమని మభ్యపెట్టుకొనాల్నా?   మేథావుల సలహాను పాటించి  ఉన్నంతలో మెరుగైన అభ్యర్థికి        ఓటేసి చేతులు దులుపుకో వలసిందేనా ?  మరేదైనా పరిష్కారం ఆలోచించవలసి ఉందా ?
       అసలీ రాజకీయ పార్టీలవ్యవస్థను నిషేధించాలి .  అభ్యర్థులంతా స్వతంత్రులుగా బరిలోకి దిగాలి . నామినేషన్ దశ లోనే  సమగ్ర పరిశీలనద్వారా  వివిథ అంశాలలో  అభ్యర్థిత్వాన్ని మదింపు వేసి  పోటీ చేయడానికి అర్హతను నిర్థారించాలి . ప్రచారార్భాటాలనూ కోట్లాది రూపాయలు వ్యయం చెయ్యడాన్నీ నిషేధించాలి .  స్వయంగా గాని
మీడియా ద్వారా గానీ  ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నియోజక వర్గ ఓటర్లను కలిసి అభ్యర్థించడం మాత్రమే
చేయాలి . పోటీలోని అభ్యర్థులంతా వడకట్టబడిన మంచి అభ్యర్థులైనప్పుడు గెలుపొందిన అందరూ ప్రజాసేవకుపక్రమించడాన్ని అనుమానించవలసిన అవసరముండదు .
       ఎన్నికలు పూర్తయి ఫలితాలు ప్రకటించిన తర్వాత గెలుపొందిన ప్రజాప్రతినిధులంతా ముఖ్య మంత్రిని         ఎన్నుకోవడం , ముఖ్యమంత్రి మంత్రులను ఎన్నుకోవడం – ఈ విధంగా పార్టీ రహిత ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేసుకోవచ్చు . 
       ఇలాంటి ఏదైనా మంచి ఎన్నికల సంస్కరణ అమలై   మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఏర్పడి నప్పుడు తప్ప    ఇప్పుడున్న రాజకీయ పార్టీల వ్యవస్థలో మాత్రం   మంచి ప్రజా ప్రతినిధులను ఆశించడం , ప్రజాధనం దోపిడీని నివారించడం  అత్యాశే అవుతుంది .


   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి