సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

4, జనవరి 2014, శనివారం

చతికిలబడిన సంక్రాంతి లక్ష్మి



        ఏంటీ అలా ఉన్నావు . వొంట్లో బాలేదా    అడిగేడు రాజారావు .
ఇంకా ఏంబాగు , ఎన్నాళ్ళీ ఒంటరి జీవితం ? తొందరగా పోతే బావుణ్ణు   అంది నిర్వేదంగా సుభాషిణమ్మ.

        రాజారావుకు 63 ,  సుభాషిణమ్మకు 58 . ఇద్దరికీ బీపీ , షుగరూ వగైరా వగైరా చాలా మంది ఆత్మీయులు బాసటగా నిలిచేరు . ముసలి తనానికీ – అనారోగ్యానికీ ఆత్మీయత కాస్త అధికమే మరి !

       రాజారావు రిటైరై ఐదేళ్ళయ్యింది . కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ యు . ఎస్ లో . కూతురూ అల్లుడూ హైద్రబాదులో . కొడుక్కి మగ , ఆడా ఇద్దరు పిల్లలు . కూతురికి ఇద్దరూ మగ పిల్లలు .

       పెద్దపండుగ రాబోతోంది . కొడుకూ కూతురూ కోడలూ అల్లుడూ మనవళ్ళూ మనవరాళ్ళ తో కళ కళ లాడుతూ ఉండాల్సిన యిల్లు . పెళ్ళిళ్లయి ఎవరికి వాళ్ళు దూర తీరాలలో ఉంటున్నారు . అందుకే దిగులు . సుభాషిణమ్మ బైట పడుతోంది . రాజారావు బయట పడడంలేదు . అంతే తేడా .

        రాజారావు మనోగతం బాల్యంలోకి మళ్ళింది . పల్లెటూరి నేపథ్యం వాళ్ళది . సంక్రాంతి వస్తుందంటే
పిల్లలంతా కొన్నిరోజుల ముందు నుంచే భోగి మంట కోసం తాటి మట్టలూ ఈత బరిగెలూ వగైరా ప్రోది చేసి పెట్టుకునే వారు . భోగి రోజు అర్థ రాత్రి దాటంగనే పోటీలు పడి మరీ భోగి మంటలు మొదలయ్యేవి .

       పది రోజుల ముందు నుంచే పిండి వంటలు తయ్యారు చేసేవారు . ముఖ్యంగా నేతి అరిసెలు – బెల్లంతోనూ పంచదారతోనూ రెండు రకాలు చేసేవారు . ఇక లడ్లూ వగైరాలు నాలుగైదు రకాలు స్వీట్లూ , నాలుగైదు రకాలు కారా తప్పనిసరి .

       ఇంటి నిండా జనం . పెద్దల పండుగ కావడం వల్ల స్వర్గస్తులైన వారికి  కొత్త బట్టలూ  నైవేద్యాలూ  పెట్టి  వాళ్లను స్మరించుకొని ధూపం వేసి  పూజాదికాలు నిర్వర్తించే వారు .  ఆ సందడే వేరు .

       పెండ్లయిన తరువాత అత్తవారింట సంక్రాంతికి అల్లుడి మర్యాదలు , ఆ ఆదరణ , ఆ వేడుకలు రాజారావు మదిలో తళుక్కున ఒక్క క్షణం మెరిసినవి .

       గతాల స్మృతి పథం నుండి బయట పడి నిట్టూర్చేడు . చివరకు ఇధ్దరు మిగిలేరు . ఏముంది పండుగ . నిర్వేదం తప్ప . ఈ వయస్సులో బిడ్డలు తోడుగా – మనవళ్లూ మనవరాళ్లతో ఆనందంగా సంక్రాంతి గడపడం – ప్చ్- అత్యాశే మరి .

        అవును నిజమే . అప్పటికీ ఇప్పటికీ  జీవన స్థితి గతులలో  ,  వసతులలో  అభివృధ్ధి కొట్టొచ్చినట్లు కనబడుతూ ఉంది . ఇప్పుడున్నన్ని వసతు లప్పుడు లేవు . ఇప్పుడున్నంత స్థితి గతు లప్పుడు లేవు . 

       గ్రామీణ భారతంలో అప్పుడు వ్యవసాయం  పాడి తప్ప వేరే ఆదాయ వనరులు లేవు .  కలిసుండడం ,
కష్టించి పని చెయ్యడం , కష్ట సుఖాలు పంచు కుంటూ , ఆప్యాయతలు పెంచుకుంటూ తృప్తి కరమైన కుటుంబ జీవన మాధుర్యాన్ని అనుభవించేవారు .

       ఇప్పుడు తల్లి దండ్రుల – బిడ్డల  ఎవరి బ్రతుకు వారిది . ఒంటరి జీవితాలు . బంధాలు తెగిన జీవితాలు . భద్రత కొఱవడిన జీవితాలు . తృప్తి చెందని మనస్సులు . మనోవేదనలు .

      కాలానుగుణంగా మార్పు సహజమే . కుటుంబ జీవన మాధుర్యం లేని మార్పు అంగీకారం కాదు .  


                       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి