సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

8, ఏప్రిల్ 2016, శుక్రవారం

నవ వసంతోదయము .....



ఎండలకు తెల్గు నేలంత మండుచుండె ,
నీళ్ళు దొరకక పల్లె కన్నీళ్ళు బెట్టె ,
ప్రాణి కోటికి బ్రతుకు దుర్భరము గాగ ,
నవ వసంతోదయమును వర్ణణలు జేయ ,

ప్రకృతి యాహ్లాదకత కనుపట్టె వీర్కి ,
గండు కోయిల కూతలు , ఘన మయూర
నాట్య హేలలు దప్ప జనాల బ్రతుకు
దుర్భరతలు కన్పట్టవు దుర్ముఖులకు .

సాంప్రదాయ బధ్ధ సద్గుణ సంపన్న
కవులకు కనులెదుట కాన రాదు ,
ఆకసమ్ము కెగిరి అందాల మబ్బుల
ఊహ లందు మనుదు రుర్వి వీడి .

చూతు రంట కవులు  సూరీడు కననట్టి
చోటు కూడ జ్ఞాన సూర్యు లగుట ,
ఎట్ట యెదుట గల్గు ఘట్టాలు కష్టాలు
కనరు కళ్లు లేని ఘనులు వీరు .

సాంప్రదాయమ్ము వీడరీ సచ్చరితులు  
పండితులు తలలూచుటే పనిగ వ్రాయు
దారులను వీడి ప్రజల చైతన్య పరచు
మార్గ మెంచుకొను టెపుడొ? మారుటెపుడొ ?

  





7, ఏప్రిల్ 2016, గురువారం

పంచాంగ శ్రవణం



ముందుగా  సుముఖి   నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు .
                     *************
సంవత్సరాధిపతి శని .
ఫలితం , అనుకూల వర్షాలుండవట . పంటలు పండవట .
జనాలు రోగ , చోర , అగ్ని , క్షామ భయాలతో కష్టాలు పడతారట .
ఇదేమి పంచాంగ శ్రవణం ?
ఎత్తుకుంటూనే మొత్తుకోళ్ళు .
సూర్య కుటుంబంలో శని గ్రహం ఆరోది . భూమికి  నూటయిరవై కోట్ల              
కి.మీ అత్యంత సుదూర కక్ష్యలో సూర్యుని చుట్టూ పరిభ్రమించే గ్రహం .
చుట్టూ తెల్లటి మంచు వలయాలతో సౌరకుటుంబంలోనే అందమైన గ్రహం.
ఈ శనిగ్రహానికి సంవత్సరాధిపత్యం అంటగట్టి ,
భూమిపై ప్రతికూల పరిస్థితులకు భాద్యత వహింపజేయడం
సమంజసమేనా ?
అందమైన శనిగ్రహానికి నలుపు పులిమి జనాలలో విపరీత ప్రభావాలకు
కారణంగా భ్రమింపజేసి , పాప పంకిలమంటగట్టడం భావ్యమేనా ?
                  **************
రాజ్యాధిపతి శుక్రుడు .
ఫలితం , విస్తారంగా వర్షాలూ , సమృధ్ధిగా పంటలూ .
పైన చెప్పబడిన ఫలితానికిది అవరోధం .
శుక్రగ్రహం సౌరకుటుంబంలో రెండో గ్రహం .
భూమికి  నాలుగు కోట్ల కి.మీ దూరంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది .
ఇది 400 డిగ్రీల సెంటిగ్రేడ్  పైగా అత్యంత వేడిమి గల గ్రహం .                                                       భూమికంటే పరిమాణంలో చిన్నది .
శుక్ర గ్రహానికి రాజ్యాధిపత్యం వల్లనే మనభూమ్మీద వర్షాలు కురిస్తే ,
పంటలు సమృధ్ధిగా పండితే , ప్రతియేడూ ఈ గ్రహానికే రాజ్యాధి పత్య
మిచ్చేద్దాం . పోయేదేముంది . ఈ లెక్కలన్నీ ఊహాజనితాలే కదా .
                 ****************
ఇక , బుధుడు మంత్రి స్థానంలో నియమితుడయ్యాడు .
ఫలితం , భూమిమీద సుఖ శాంతులు నెలకొల్పుతాడు . మంచిదే కదా .
బుధగ్రహం సౌరకుటుంబంలో సూర్యగోళానికి అత్యంత సమీపంలో ఉంది .
సౌరకుటుంబంలోనే అతి చిన్నగ్రహం . మొదటి గ్రహం .
భూమికి తొమ్మిది కోట్ల కి. మీ దూరంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది .
నిరంతర సౌరవీచికల కారణంగా విస్ఫోటనాలతో అల్లకల్లోలంగా ఉంటుంది .
దీని ప్రభావం భూమ్మీద పడితే సుఖ , శాంతులెలా ప్రాప్తిస్తాయో మరి .
                    ****************
సేనాధిపతికుజుడు                                                                                                               ఫలితం ఫ్రపంచమంతా యుధ్ధాలతో తన్నుకు చస్తారట . కుజగ్రహమంటేనే                                             జనాలు జడుసుకునేట్లు భావజాలాన్ని
వృధ్ధి చేశారు . కుజ దోష నివారణార్థం ఎన్నెన్ని కర్మకాండలో . మరి
భూమి మొత్తానికి దోషనివారణకేమి చేస్తారో . కర్మ క్రతువులకు పూను
కోండి మరి . బిజినెస్ బాగా జరుగుతుంది .
కుజగ్రహం సౌరకుటుంబంలో నాలుగో గ్రహం . భూమికి ఎనిమిది కోట్ల కి.మీ
దూరంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూఉంది . ఇది భూమిని పోలిన గ్రహం .
దీనిపై రెండు కోట్ల సంవత్సరాల పూర్వం జీవం మనుగడ సాగించినట్లు శాస్త్ర
జ్ఞులు భావిస్తున్నారు . మనం భవిష్యత్తులో నివసించడానికి అవకాశం ఉండే
గ్రహం సౌరకుటుంబములో ఇదొక్కటే . సమీప భవిష్యత్తులో మనకు నీడ
నిచ్చే ఈ కుజ గ్రహాన్ని పాప పంకిలం చేసేశారు .
                   *****************
రసాధిపత్యం చంద్రుడికి దక్కింది .
ఫలితం...... పాలు , నెయ్యి , నూనె , తేనె సమృధ్ధి . చంద్ర గ్రహానికీ జనాల మనో
భావాలకూ లింకు పట్టేశారు . చంధ్రబలం , తారాబలమంటూ కథలల్లేశారు .
చంద్రుడు భూమికి ఉపగ్రహం . 
భూమికి ప్రదక్షిణం చేస్తూ , భూమినంటిపెట్టుకుని , భూమితో పాటుగా సూర్యుని చుట్టూ
పరిభ్రమిస్తూ ఉంది . ఈ ఉపగ్రహం మన సూర్యనక్షత్రానికే 15 కోట్ల కి.మీ దూరంలో
ఉంటే , ఇక, అనంత దూరాలలో ఉండే నక్షత్ర రాసులకు అధిపతి ఎట్లయ్యాడో ?
ఈ ఉపగ్రహం మన భూమి చుట్టూ 27రోజులకొక సారి ప్రదక్షిణం చేస్తూ , అంతే
వేగంతో తిరుగు తుండడంవల్ల మనకు ఎప్పుడూ ఒకేవైపు కన్పిస్తూ ఉంటుంది .
అనాదిగా భూమిమీది జనాలకు కాలగణణకు తోడ్పడుతూ ఉంది .
భూమి ప్రభావానికి లోనై భ్రమించే ఈ ఉపగ్రహానికి జ్యోతిష్యంలో ఎంత గొప్పదనం
కట్టబెట్టేశారో చెప్పనలవికాదు .   
                                **************************                                                                                   ఇంకా , చెబితే శానా ఉంది , ఈదుర్ముఖుల పంచాంగం .
                        
ఇరవ్వేడు నక్షత్రాలూ , పండ్రెండు రాశులూ , రాశి ఫలాలూ , రాశి చక్రాలూ , ఈ
గోలంతా ఊహాజనితం . విశ్వాంతరాళాన్ని అసంబధ్ధంగా విభజించి చేసిన మాయా గణితం .
విశ్వ విజ్ఞానం ఇంతగా వెల్లివిరియని రోజుల్లో , కొంతమంది జిజ్ఞాసువులు                                        తమకందుబాటులో,  ఉన్న పరిమిత పరికరాల సాయంతో, విశ్వంవైపు దృష్టి
సారించినారు . ఫలితంగా , విశ్వరహస్యాలు కొన్ని ఛేధించినారు . ఆధునిక
ఆవిష్కరణలకు వారు వేసిన బాటలే తొలి అడుగులు . ఆ మహానుభావులు
చిరస్మరణీయులు .
కానీ , ఆ జ్ఞానాన్ని  మేధావుల ముద్ర వేసుకున్న కొందరు స్వార్ధపరులు                                              ఇలాంటి అనృతాలకు వాడి , అసంబధ్ధాలు సృష్టించి ,
మనిషి జన్మకు ముడిపెట్టి , జాతకచక్రాలు కట్టి , జనాలను బ్రమలలో
ముంచి , ముందుగానే జరగబొయ్యేది తెలుసుకోచ్చనే ఆశ చూపి ,
దోష నివారణ కర్మ కాండలు సూచించి , ప్రేరేపించి  వ్యాపార మయం చేశారు .
ఇది దుర్మార్గం కాదా ? దీన్ని ప్రశ్నించవద్దా ?  మేధావులు జనాల్ని బ్రమల్లో
ముంచుతారా ?  జ్ఞానంవైపు నడిపిస్తారా ?

5, ఏప్రిల్ 2016, మంగళవారం

పుట్టతెనుగు తేనె పలుకు .....



పద్యమందు , పల్లె పట్టులందు , అచటి
మనుజులందు , వారి మాటలందు ,
అందు తేనెలూరు ఆప్యాయతల తెల్గు
దనములందు తియ్యదనము కలదు .


పట్టణ వాసనలంటని
మట్టిన్ మన పలుకుబళ్ళు మనుచున్నవి
పుట్టతెనుగు తేనె పలుకు
పట్టి పిడిచి పద్యమందు వాడగ వలదా?

పద్యము లన్న నాంధ్రులకు ప్రాణము  పద్యము తెల్గువారి  వై
విధ్య వచో విధాయక ప్రవృత్తి  , నిరక్షర కుక్షియైన  తా
పద్యము జెప్పిగాని తన పల్కు ముగించడు తెల్గు నేలకున్
పద్యముకున్ గలట్టి యనుబంధము లిట్టివి , చూడ ముచ్చటౌ .

మూటలు గట్టి పద్యముల ప్రోవులు వోసిరి -  పల్లెటూళ్ళ 
తేటల తెల్గు మాటలను - తిక్కన పోతన వేమనాదు ,  లా
మాటల నేటి పండితులు మాటికి మాటికి గ్రామ్యమందురే ,
పోటుల గాళ్ళ వీళ్ళు  , కవి మూర్తుల బాటలు లెక్క చేయరా ?

చదువుట తోనె యర్ధమగు చాయలు దోచగ పద్యమాలికన్
బొదిగిన రామణీయకపు పొల్పులు దెల్పగ  తల్లి భాషకే
చదురులు గల్గు గాన  - సహజమ్మగు తెల్గు పదాల సొంపులన్
మదికి లయించి వ్రాయు గరిమల్ గల పద్యము లింపు గూర్చెడిన్ .