సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

15, జూన్ 2017, గురువారం

మనోఙ్ఞమైన పద్యం

మనోఙ్ఞమైన సీసపద్యము
-------------------------------
అవగాహనేహా సమాయత్త విభుదరా
ట్కమనీయ మణి శతాంగములనంగ
తాటాక సేతు సందర్శనేచ్ఛా గత
స్థిత సమున్నత మహా శిఖరులనగ
నేతదుజ్వల ధరానేతృ సంపాదిత
మూర్తి భాస్వద్కీర్తి మూర్తులనగ
ముక్తా మణీ యుక్త మోహనాంబర చుంబి
వరుణ రాజన్య గోపురములనగ

నిలిపె గుల్లూరి నల్ల చెర్వలుగు నందు
ముప్పదియు మూడు రా కంబములు జెలంగ
చింతపట్ల పురస్థాయి శ్రీవిధాయి
రుచిర గుణహారి చెంచయ రుద్రశౌరి .

        పై పద్యం భావం
         -----------------
మా కుల్లూరి శీమ రాజ్యభార ధురంధరుండైన
చింతపట్ల రుద్రశౌరి మాయూరి నల్లచెరువుకు
ముప్పదిమూడు రాతిస్థంభాలతో అలుగు నిర్మిం
చెను . ఆ అలుగు వర్ణణ యిది .
క్రీ.శ. 1612లో
శిలాశాసనంలో వ్రాయబడి ఉంది .
సదరు చెరువులో మునగడానికి వచ్చి దేవతల
రాజు అచట నిలిపిన కమనీయ మణిమయ
రథము వలెనూ , తటాక సేతు సందర్శనేచ్చతో
వచ్చిన సందర్శకులకు శిఖరముల వలెనూ ,
ప్రకాశమానమైన కుల్లూరి శీమను పాలించిన
రాజులు సముపార్జించిన కీర్తి స్థంభాల వలెనూ ,
ముత్యములు మణులతో నిర్మితమై ఆకసము
నంటుచున్న వరుణదేవుని రాజమందిర గోపు
రముల వలెనూ అలుగు రాతిస్థంభములున్నవట .

ఈ శాసనం మాయూరి చెరువు అలుగు వద్ద ఇప్పటికీ నిలిచి ఉంది . శాలివాహనశకం 1534
పరీధావి సంవత్సరం కార్తీక బహుళ ద్వాదశి సోమవారం అనగా క్రీ.శ.1612 న ఇది వ్రాయ
బడింది .
అప్పట్లో వీర వెంకట పతి రాయలు సామ్రాజ్య
మేలుతూ ఉండేవారు . వారి సామంతులుగా
ఈ ప్రాంతాన్ని రేచర్ల పద్మనాయక వంశ ప్రభువు
వెలుగోటి వెంకటపతినాయనింగారు పాలించేవారు . రుద్రప్ప వీరి రాజ్యభార ధురందరుడు . అంటే సర్వ సైన్యాధ్యక్షులన్నమాట .
ఇదీ సంగతి .

ఈ శాసనంలో ఇంకో విశేషముంది .
శాలివాహన శకం 1534 అని వ్రాయడానకి
బదులుగా ---
' శాలివాహన శకే వార్ధిత్రిబాణేధరా సంఖ్యాకే '
అని వ్రాసి ఉంది . అనగా ----
వార్ధి = సముద్రాలు = 4
త్రి = 3
బాణ = 5
ధరా = 1
అంకానాం వామతో గతిః కాబట్టి
శాలివాహనశకం = 1534 అనుకోవాలి .
సంస్కృత శ్లోకం తర్వాత శాసనంలో
తెలుగు ప్రారంభించారు .
అక్కడ శాలివాహన శక వరుషంబులు 1534
అని తెలుగంకెలలో వ్రాయబడి ఉంది .


శ్రీ పంతుల గోపాల కృష్ణారావు గారు
ఒక టపాలో వివరించినట్లు
సున్న , అరసున్నలు తెలుపుటకు ---
సున్నతరువాత ద్విత్వం చేసి వ్రాసియున్నారు .
అలాంటి వాటిని నిండుసున్నగానూ ---
సున్న తరువాత ద్విత్వం వ్రాయని చోట్ల
అరసున్నగానూ చదువితే శాసనం సులభం
గా అర్థమయ్యింది . అనవసరమైన చోట్ల సున్నలెందుకు వ్రాస్తున్నారో , అవసరమైన చోట్ల సున్న తదుపరి ద్విత్వమెందుకు చేస్తున్నారో అర్థంగాక సతమత మయ్యేది . కాని , పంతులు గారి టపా సంశయాన్ని తొగించింది . వారికి కృతఙ్ఞతలు . ఇక రేఫను తదుపరి అక్షరానికి
ఆవల గిలకగా వ్రాయడం సరేసరి .