సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

23, ఆగస్టు 2019, శుక్రవారం

కుల్లూరు సీమ ~ చరిత్ర

                       
కుల్లూరి సీమకు విజయనగరసామ్రాజ్యానికీ విడదీయరాని
సంబంధం ఉంది .శ్రీకృష్ణదేవరాయల హయాంనుండీ ఆరవీటి రాజుల హయాం వరకూ  ఈ సంబంధం కొనసాగింది . విజయనగర రాజులు పరిపాలనా సౌలభ్యం
కొఱకు  సామ్రాజ్యాన్ని కొన్ని రాజకీయ విభాగాలుగా మలచుకున్నారు . ' సీమ ' అనే విభాగం అందులో ఒకటి .
నెల్లూరు సీమ , ఆత్మకూరు సీమ , వెంకటగిరి సీమ , రాపూరు సీమ , కుల్లూరు సీమ  అనేవి మన ప్రాంతానికి
చెందిన ' సీమ ' విభాగాలు .
          విజయనగర సామ్రాజ్యాన్ని  ఏలిన  సంగమ సాలువ   వంశాల తదుపరి  తుళువ వంశం అధికారాన్ని
చేజిక్కించుకుంది . తుళువ నరసనాయకుడు  నాగలాంబల కుమారుడు శ్రీకృష్ణదేవరాయడు   తిమ్మరసయ్య తంత్రాంగంతో 1509 లో ఆగష్టు 8 న
శ్రీజయంతి పర్వదినాన విజయనగర సామ్రాజ్య పట్టాభి
షిక్తుడైనాడు . దిగ్విజయ యాత్రలు సాగించి , సామ్రాజ్యాన్ని బహుదా విస్తరించి , అవిఛ్ఛిన్నంగా 1529
వరకూ రాజ్యపాలన చేసాడు . ఉదయగిరి , కొండవీడు ,
కొండపల్లి , సంహాచలం ప్రాంతాలను ఆక్రమించాడు .
ఉదయగిరి దుర్గాధిపతి తిరుమల రాహత్తరాయని ఓడించి ,  తన సేనాపతి  రాయసం కొండమరుసయ్యను
దుర్గాధిపతిగా నియమించాడు . దుర్గంలోని బాలకృష్ణ
విగ్రహాన్ని రాజధాని హంపికి తరలించి , కృష్ణాలయం
నిర్మించాడు .
           1512 లో ఉదయగిరి దుర్గాధిపతిగా నియమించబడ్డ కొండమరుసయ్య మహామంత్రి తిమ్మరు
సయ్య సమకాలికుడు , బంధువు , సేనానులలో ఒకడు .
          నాటి కుల్లూరు సీమలో నేటి కలువాయ , అనంతసాగరం  మండలాలూ , తెగచెర్ల వరకూ రాపూరు మండలంలో కొంతభాగం గ్రామాలు ఏలుబడిలో ఉండేవి .
ఈ ప్రాంతాలు నీటి యెద్దడితో పంటలు పండక కరువు కాటకాలతో సతమతమవుతూ ఉండుటను తెలుసుకుని
రాయలవారు సేద్యపరంగా చెఱువులు నిర్మించడానికీ ,
సైనికపరంగా వటిష్టం చేయడానికీ పూనుకుని , ఉదయగిరి
దుర్గంనుండి కుల్లూరుసీమకు అధిపతిగా నియమించి నాడు . కొండమరుసయ్య 1514 ~ 15 ప్రాంతంలో
కుల్లూరు పట్టణంలో మట్టికోటను నిర్మించి , కోటకు ప్రక్కనే
నల్లచెఱువును , శివాలయాన్నీ నిర్మించాడు . కోట చుట్టూ
శత్రు దుర్భేద్యంగా అగడ్తను ఏర్పరచినాడు . తంజనగరం నుండి గుఱ్ఱాలను కొని తెచ్చి , కోటలో ఆశ్విక దళాన్ని
ఏర్పాటు చేసి , కుల్లూరును సైనిక పట్టణంగా తీర్చిదిద్దినాడు .
            అరోజుల్లో , కుల్లూరు పట్టణం  యుధ్ధ విద్యలలో నిరంతర శిక్షణ శిబిరాలతో సందడిగా ఉండేది . కొండమరుసయ్య ఆధిపత్యంలోనే అనంతసాగరం , కలు
వాయ చెఱువులు కూడా నిర్మింప బడ్డవి .
            విజయనగర రాజుల హయాంలో  ఒక సంవత్సర
కాలం అంటే _ ఆశ్వజయ శుధ్ధ దశమి మొదలు మహర్ణవమి వరకు . ఈ సాంప్రదాయం కుల్లూరు పట్టణంలో కూడా ఉండేది . ఆశ్వజయ మాసారంభం నుండి మహర్ణవమి వరకూ తొమ్మిది రోజులు పట్టణంలోని సైనిక శిబిరాలలో యుధ్థవిన్యాసాల పోటీలు జరిగేవి .
గెలుపొందిన వీరులకు విజయదశమి రోజున బహుమతి
ప్రదానం జరిగేది . విజయదశమి నుండి జైత్రయాత్రలు
సాగించేవారు .
             చంద్రగిరి రాజధానిగా పాలించిన సాళువ నరసిం
హరాయల వద్ద కొలువు చేసిన ఆరవీటి తిమ్మరాజు రాజుగా విజయనగర సామ్రాజ్యాన్ని ఆరవీటి వంశం చేజిక్కించుకుంది . తిమ్మరాజు కొడుకు తిరుమలరాయ
లు . అతని కొడుకులలో వీర వెంకటపతి రాయలు చం
ద్రగిరి రాజధానిగా తమిళప్రాంతాన్ని 1612 వరకూ పాలించినాడు .
           వీర వేంకటపతి రాయలపై తమిళప్రాంతం లోని
పాండ్యులు తిరుగుబాటు చేసినారు . ఈ తిరుగుబాటును రాయల సామంతరాజు రేచర్లపద్మనాయక ప్రభువైన  రాజా వెలుగోటి వెంకటపతినాయనింగారు సమర్ధంగా
అణచివేసినారు . అందుకు బహుమానంగా వీరవేంకటపతిరాయలు నెల్లూరు ప్రాంతాన్ని అమరానకు
పాలించుకొనుటకిచ్చి , పంచపాండియధరావిభాళుం
డు , సంగ్రామపార్ధుండు , పద్మనాయక వంశాంభోది  చంద్రుండు అను బిరిదులతో నాయనింగారిని
సత్కరించినారు .
          నాయనింగారి ఏలుబడి లోకి కుల్లూరిసీమ కూడా
చేరింది . అటుపై రాజా చింతపట్ల రుద్రప్పనాయనింగారిని
కుల్లూరిసీమ కధిపతిగా నియమించుకొనిరి .
           విజయనగర రాజుల మార్గంలోనే  ,  వెలుగోటి
వెంకటపతి నాయనింగారు కుడా ప్రజోపయోగ కార్యాలలో
ప్రసిధ్ధి చెందిరి . అనేక చెరువులు వీరి హయాంలోనే మరమ్మత్తులకు నోచుకున్నవి . కుల్లూరుసీమలో భాగమైన
అనంతసాగరం చెఱువు గట్టు కేతామన్నేరు ఉరవడికి
ప్రతియేటా తెగి , నీళ్ళు ఊళ్ళను ముంచుతుండేవి .  వెంక
టవతి నాయనింగారు రుద్రప్పనాయనింగారిచే కట్టను పటిష్టపరచి , తూము నిర్మింపజేసి శాశ్వత పరిష్కారం
చూపినారు . అనంతరం కలువాయ చెఱువుకు అలుగు
నిర్మించినారు .
             1612లో రాజా వెలుగోటి వెంకటపతి నాయనిం
గారు  కుల్లురుసీమ అధివతి రాజా చింతపట్ల రుద్రప్పనాయనింగారిని తన కొలువుకు రావించి ,
సబహుమానంగా గౌరవించి ,  తన తండ్రి రాజా కుమార తిమ్మానాయనిగారికి పుణ్యం కలనగననట్లుగా కుల్లూరు
నల్ల చెఱువుకు తూర్పలుగు నిర్మించవలసందిగా కోరిరి .
వారికోరిక మేరకు రుద్రప్పనాయనింగారు ముప్పదిమూ
డు శిలాస్ధంభాలతో నల్లచెఱువుకు అలుగు నిర్మాణం
చేపట్టినారు . సాక్ష్యంగా ఇప్పటికీ మా చెఱువు గట్టున ఒక
శిలా శాసనం ఉంది .

2 కామెంట్‌లు:

  1. ఆసక్తికరమైన వ్యాసం, రాజారావు మాస్టారూ.

    కుల్లూరులో కొండమరుసయ్య నిర్మించిన కోట, ఆ నల్లచెరువు ఇంకా ఉన్నాయా?

    కొంతమంది రాజులు / చక్రవర్తుల గురించి, ఆదిశంకరుల వారి గురించీ విన్నప్పుడు స్వల్పకాలంలోనే వాళ్ళు సాధించినది ఆశ్చర్యం అనిపిస్తుంది. ఉదాహరణకు శ్రీకృష్ణదేవ రాయల వారినే తీసుకోండీ. వారి పరిపాలనా కాలం కేవలం 20 సంవత్సరాలు (1509- 1529). ఆ కాలంలో ప్రయాణ సాధనాలూ సామాన్యమైనవే - వేగం కోణం నుండి చూస్తే. అయినప్పటికీ రాయలవారు అంతంత దూరాలు వెళ్ళి దండయాత్రలు చేశారు. ఎక్కడ హంపి, ఎక్కడ సింహాచలం, దాన్నీ దాటి గజపతుల రాజ్యం? మధ్యలో బహమనీలను ఎదుర్కోవడం (బీజాపూర్ వైపు). ఎంతెంత దూరాలు. పైగా వెళ్ళినంత దూరమూ తిరిగి వెనక్కి ప్రయాణించాలిగా .. ఇల్లు చేరుకోవడానికి (శంకరాచార్యుల వారు వెనక్కి రాలేదు లెండి). ఇంకా రాయలవారి తిరుపతి యాత్ర ! మధ్యలో పరిపాలనా వ్యవహారాలు, సంసారబాధ్యతలు, కళాపోషణ. నాకయితే నిజంగా అబ్బురంగా ఉంటుంది ఆలోచిస్తే.

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు నరసింహరావుగారూ ,
    మా వూళ్ళో మా ఇళ్ళల్లో నా చిన్నతనంలో పటాకత్తులూ డాళ్ళూ తుపాకులూ ఉండేవి . దసరాలో మూలానక్షత్రం
    (సప్తమి తిధి)ప్రవేశించినప్పుడు ఆయుధపూజ నిర్వహించేవారు . అందరి ఇళ్ళల్లో కత్తులూ కటార్లూ ~ ఈ
    తతంగాలూ ~ మరేవూల్లో కనిపించకపోవడం ~ ఇది నాకు
    ఆసక్తి కలిగించి చరిత్ర త్రవ్వి తోడేను . ఆసక్తికరమైన చారి
    త్రకాంశాలు బయట పడ్డవి .
    రాయరాణువలో మంత్రులుగా , సేనానులుగా , అనేక హో
    దాలలో బ్రామ్మలూ , బలిజలూ సేవలందించారు . కొండమురసయ్య రాయసంవారు . కృష్ణరాయలకూ , తిమ్మరుసయ్యకూ సన్నిహితులు . మా ప్రాంతానికి ప్రాతస్స్మరణీయులు . వారు నిర్మించిన కోట ఆంగ్లేయుల
    ఫిరంగిదాడులలో ధ్వంసమయ్యింది . నల్లచెఱువు సేద్యా
    వసరాలు తీరుస్తూ ఉంది . ఆశివాలయంలోనే నేను గత
    కార్తీకంలో రుద్రయాగాది క్రతువులు నిర్వహించింది .
    తమరన్నట్లు మహనీయుల చరిత్రలు అబ్బురపరచేవే , నిస్సందేహంగా .

    రిప్లయితొలగించండి