సుజన సృజన

సుజన సృజన
ఓం నమో సాయి నాధాయ

31, డిసెంబర్ 2015, గురువారం

క్రొత్త వత్సరమ్ము కొలువు దీరె

క్రీస్తు శకము నందు ప్రస్తుత మ్మింకొక్క
క్రొత్త వత్సరమ్ము కొలువు దీరె ,
మనిషి బ్రతుకు నందు  మార్పులేవైపుకో ?
మంచివైపు కగున  ఇంచుకైన ?

భూమికావల నెక్కడో పుడమి బోలు
పుడమి కోసము గాలించు బుధులు !  సగము
కూటి కేడ్చెద రిచట   ఆకొన్న జనుల
గూర్చి బాగోగు లరయరా ?  కొంచమేని .

గతము కంటె చదువులు , విజ్ఞాన మధిక
మయ్యె గాని  , సంస్కార మేమయ్యెనో క
నంబడదు, వక్ర బుధ్ధి కనంగ నయ్యె ,
మానవత్వమె  అన్నింట మాన్యత గద !

తెలుగు రాష్ట్రాలు రెండయ్యె , చెలగి యందు
ఒకటి స్వర్ణాంధ్ర యయ్యె , ఇంకొకటి యిదిగొ !
కనుడు! బంగారు మయమయ్యె , కరువు బట్టి
రైతు చచ్చెను మృత్యు కోరలకు జిక్కి .

ధరవరలు పెరిగి బతుకు దారుణమయి
సగటు జీవులు కడగండ్ల బొగులుచుండ ,
పట్ట వేలిన వారికి ప్రజల పాట్లు
ఏటి కేడాది మారిన నేమి యొరుగు ?
  





24, డిసెంబర్ 2015, గురువారం

మన తల్లిభాష మన తెలుగుభాష వర్థిల్లాలి

చిన్నూ , ఇంద బనానా తిను
మామ్ నాకు బనానా ఇష్టం లేదు , ఆపిల్ కావాలి
నాన్నా , డాడ్ కి ఫోన్ చేసి చెప్తాన్లే , ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు ఆపిల్ తెమ్మని . మా చిన్నూ గుడ్ బాయ్ , ఈరోజు బనానా తింటాడు . అస్సలు మారాం చెయ్యడు , ఓకే?
ఓకే ,  మామ్
దట్స్ గుడ్
                                             ****************
హలో బావ గారూ , ఏవిటో ఈరోజు పొద్దుట్నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నా , వల కలవడం లేదు. అంతర్జాలం అస్సలు తెరుచుకోవడంలేదు . సమస్యాపూరణం దుంగ లో సమస్య ఏవిచ్చాడో తెలిసి చావట్లేదు , తవరి నిస్తంత్రీభాషిణికి పిలుపందించి తగలడదామనీ.....
హారినీ...రావుడూ, నువ్వటోయ్ , అదేవిటోనోయ్ మా మేజోపరి భోషాణం పరిస్థితి కూడా అల్లానే తగలడింది . మూషికం చచ్చిందో , కీలు పలక పాడయ్యీందో తెలిసి చావట్లేదు .
ఒరేయ్ అబ్బాయీ, ఈ భోషాణంతో నేను పడ్లేను, ఒక ఊరోపరి కానీ , హస్తోపరి కానీ కొని తగలడరా అంటే వింటాడా , మా శివుడు ? నిన్నకు నిన్న _ తెలుగేలా ఆంగ్లభాష తియ్య్డగనుండన్ _ అంటూ ఒహ వెటకారపు సమస్యనిచ్చి చచ్చాడా పెద్దమనిషి . దాన్ని పూరించలేక నాతలప్రాణం తోక్కొచ్చిందనుకో . ఈరోజేమిచ్చి తగలడ్డాడో మరి ! నేనూ అందుకేగా జుట్టు పీక్కుంటుండేది . ఆ శర్మగారి నిస్తంత్రీభాషిణికి చేసి తగలడు . తెలుసుకుని నాకూ తగలడు .
                                                   ****************
హలో వదినా , ఈవినింగ్ సిక్స్ థర్టీకి మాటీవీలో వస్తుందే , అదే , ఈతరం ఇల్లాలు సీరియల్ మిస్సయ్యాను నిన్న . మా పక్కింటావిడ సుథేష్ణ లేదూ, తనిష్కలో బేంగిల్స్ కొనడానికి తీసుకెల్లిందిలే , నాకైతే ప్రజెంట్ ట్రెండ్స్ తెలుసుననీ..... సర్లే , సూర్య టీవీ కొన్నాడా , సూర్య మదర్  ఒప్పుకుందా , అసలేంజరిగిందోనని ఒహటే టెన్షన్ ఫీలవుతున్నాననుకో , కాస్తంత డీటెయిల్డ్ గా నేరేట్ చెయ్యీ .
                                                     ****************
       భాష పారుటేరు . భాష జనబాహుళ్యానికి సొంతం . జనబాహుళ్య వినిమయమే భాషకు పరమప్రయోజనం . తరతరాలుగా మన తల్లిభాష మన తెలుగుభాష వర్థిల్లాలి .
      అరటి పండును బనానాగా , ఆపిల్ ను సీమరేగుగా మార్చొద్దు . అరటిపండునూ , ఆపిల్ నూ ఎట్లవట్ల వాడుకుందాం .
       ఓరుగంటినీ , ఒంటమిట్టనూ ఏకశిలానగరాలుగా సంస్కృతీకరించి ,
చక్రాయుధుణ్ణి చుట్టుకైదువుజోదుగా తెనిగించినంత మాత్రాన వాడుకలోకితీసుక రాగలిగేరా ?
          రైలు , రోడ్డు లాగే కంప్యూటర్ , టీవీ , ఇంటర్ నెట్ , ఫోన్ ,
మొదలైన పేర్లను తెనిగించబోయి , సంస్కృతీకరించి అంతర్జాలాలూ , మూషికాలూ చెయ్యాల్నా !
మన భాషలో చేరి విరివిగా వినిమయమయ్యే ఇతర భాషల పదాలు ఎట్టివట్ల వాడుకోవడం మన భాషకూ , మనకూ ప్రయోజనకరం . మాతృభాషపై కుహనా మమకారంతో ఆధునిక పరికరాల అసలు పేర్లను నకిలీ చేస్తే కృతకమై , వికృతభాష తయారౌతుంది .
           అట్లనే వినియోగంలో ఉన్న తెలుగు పదాలకు బదులు  ఆంగ్లపదాలను వాడి , వాటిని వాడుకలో లేకుండా చేయడం తరవాతి తరాలకు ద్రోహం చెయ్యడమౌతుంది .
            నా తెలుగు జాతికంతటికీ మాతృభాషా శుభాభినందనలు .


13, డిసెంబర్ 2015, ఆదివారం

ఆనాటి పారవశ్యం .....

2012 మార్చి22 న ఆనాటి తెలుగు బ్లాగుల ,
బ్లాగరుల మనో మనోజ్ఞతలు పరవశింప జేయగా , 
ఆపారవశ్యంలో పడి వ్రాసుకున్న ఆనందమయ 
పోష్టు ..... (తెలుగు బ్లాగుల తోటలో బ్లాగరు
పూమొల్కలార !) ..... అంటూ ___
                   *****
పూర్వ మొక్కరో యిద్దరో పొగడ దగిన
రచయితలు  క్రొత్తవారు ‘  తారస పడంగ
జూచితిమి గాని నేడహో !    చూడచక్క
నైన ‘  రచయిత లెందరో గాన నయ్యె

తెలుగు బ్లాగుల తోటలో మొలిచి , నిలిచి
వ్రాయు  బ్లాగరు పూమొల్క లార  మీ ర
చనల సౌగంధి కాలతో తెనుగు దోట
నేడదిగొ  గుభాళించి పన్నీరు చిలికె 

ఒకరి మించి యొకరు బ్గాగులో కబుర్లు ,
కవితలు , చిత్రా , లనుభవాలు , కథలు వెరసి
వివిథ రచనా విలాస భాస్వికలు గూర్చ ,
బ్లాగు భారతి తెలుగున పరవశించె

ప్రతి తెలుగు బ్లాగ రందున ప్రతిభ గలదు
తాము వ్రాయుటేగాదు వ్రాతలను జూచి
యొకట స్పందించు భావుకత గలదు
రచయితల కుండ దగ్గ వీ లక్షణములె

ఇన్ని తెల్గు కోకిలలు దీపించి యెగసి
కోరి గొంతెత్తి పాడు చున్నారు  చేరి
అందరికి శుభాకాంక్ష లంద జేతు
 నందనోగాది ‘  కానంద మంద గోరి  







11, డిసెంబర్ 2015, శుక్రవారం

తెలుగు పద్య సఖియ .....

తెలుగు పద్యమెంత తీపు రా ! రుచి చూడు
చెఱకు రసము కంటె , చెలిమి కంటె ,
తేనెలో నిగిరిన తియ్యమామిడి కంటె
పల్లె సీమ లోని బ్రతుకు కంటె .

పుట్టిల్లు తెలంగాణా ,
మెట్టిన పురి సింహ పురము , మిగిలిన చోట్లన్
పట్టము గట్టిరి తెలుగులు
దిట్టగదా ! తెలుగు పద్య ధీర కృతులలో .

తెలుగు పద్య సఖికి తిక్కన్న నేర్పించె
అచ్చమైన రాజ హంస నడలు
మాట తీరు , మంచి , మర్యాద నేర్పిరి
వేమన , గురజాడ వివిధ గతుల .

తెలుగు సొంతమైన తేట గీతులు పాడె
ఆట వెలదు లందు నాట్య మాడె
కందమందు తెలుగు విందులు సమకూర్చె
తెలుగు పద్య మౌర ! తెలుగు జాణ !

నెల్లూరు సన్నబియ్యము
జెల్ల పులస రాజమండ్రి చేపల పులుసున్
చల్లని మంజీర నీళ్లు
చెల్లును పద్యపు రుచికర చెలువము తోడన్ .



10, డిసెంబర్ 2015, గురువారం

లంకె .....

         "ఏజన్మలో ఏం పాపం చేశాడో ఇప్పుడనుభవిస్తున్నాడు , ఇలా గౌరవింప బడడం నా పూర్వ జన్మ సుకృతం . "
అనే మాటలు తరచుగా వింటుంటాం , మరి _
ఈజన్మలో సుకృతాలేవీ లేవా ,
దుష్కృతాలేవీ లేవా ?
ఉండే ఉండాలిగా !
మరి , వాటి ఫలితాలెవరనుభవిస్తారు ? మనమా , బిడ్డలా ?
               **********
" పూర్వ జన్మలలో చేసుకున్న కర్మలనుబట్టి జీవి పర జన్మలలో
మంచిగానీ , చెడుగానీ అనుభవించ వలసి ఉంటుంది "
ఇదొక జన్మ జన్మల సిధ్ధాంతం .
" కర్మల ఫలితాలను బట్టి జీవి మనిషిగా పుట్టాల్నా , కుక్కగా
పుట్టాల్నా , కోడిగా పుట్టాల్నా  _ ఏజీవిగా పుట్టాలనేది నిర్ణయింప
బడుతుంద " నే మరో అర్థం పర్థం లేని సిధ్ధాంతం కూడా ఉంది .
" సుకృతాలు చేసిన వారు దేవ యోనులలోనూ , దుష్కృతాలు
చేసినవారు రాక్షస యోనులలోనూ పుడతార " నే మరో రాధ్ధాంతం
కూడా ఉంది .
ఒక జీవి DNA తో మరో జీవిది విభేదిస్తుంది గనుక మనిషి
మనిషిగానూ , కుక్క కుక్కగానూ పుట్టాల్సిందే . ఒక జీవి
మరో జీవిగా పుట్టే పరిస్తితులెక్కడా తలెత్తవు .
ఇక దేవ , రాక్షస , యక్ష , కిన్నర , కింపురుష , గంధర్వాది
మానవాతీత గణాలన్నీ పురాణ గాథలు . వీళ్ళంతా మనుషులే .
మానవ జాతి గాక మరో జాతి బుధ్ధిజీవులున్న దాఖలాలు ఈ భూమ్మీద
గానీ మరో లోకంలోగానీ ఇంత వరకూ తెలియ రాలేదు .
             ************
సమస్త జీవరాశులలో మనుషులు మాత్రమే బుధ్ధి జీవులు .
తమ విచక్షణా ఙ్ఞానంతో మిగతా జీవులకంటే భిన్నమై ఉత్కృష్టమై
ఉన్నారు . జీవజాలమంతటా మానవులదే పైచేయి .
ప్రతి మనిషికీ
తల్లిదండ్రులతని పూర్వజన్మ . బిడ్డలతని తరువాతి జన్మ .
నిస్సందేహంగా
సుకృతాల వల్ల మంచి జన్మలూ , దుష్కృతాల వల్ల చెడు జన్మలూ
తప్పని సరిగా ఏర్పడతాయి .
మనిషి జీవన విథానం మంచి చెడుల సమ్మిశ్రితం .
                   *************
మనిషి  తాను మూటగట్టిన డబ్బూ దస్త్రమే కాదు ,
రూపు , రంగూ , ప్రవర్తించిన తీరు , భుజ బలం , బుధ్ధి బలం ,
ఆరోగ్యం , రోగాలూ , కళలూ , కౌశలాలూ , నైపుణ్యాలూ ,
దస్తూరీతో పాటు సర్వం మూట గట్టి తన బిడ్డలకూ _ తద్వారా
తర్వాతి తరాలకు _ అదే _ తన తర్వాతి జన్మల కందిస్తున్నాడు .
దీనినే మన పెద్దలు ప్రారబ్దమన్నా రు . అనుభవించక తప్పదన్నారు .
కానీ ,
ఈ విషయంమీద మంచి అవగాహన ఉంటే ఈ ప్రమాదాన్ని కూడా
అధిగమించ వచ్చు .
ఇందుకోసం మన పూర్వీకుల గురించిన సమగ్ర అవగాహన ఉండాలి .
కనీసం మన తల్లి దండ్రుల , తాత ముత్తాతల వరకైనా .
కేవలం వాళ్ళనుభవించిన రోగాల గురించయినా .
హాస్పిటల్ కెళ్ళితే ,
డాక్టర్ కూడా ఆరా తీస్తున్నారు కదా !
బుధ్ధి వికసించి తరుణ ప్రాయం వచ్చేటప్పటికే ,
అంటే వివాహానికి ముందే ,
తెలుసుకుని ఉంటే ,
ఆహార వ్యవహారాదిగా జీవనశైలిని  మార్చుకుని సదరు రోగాలు
మనకు రాకుండా చూచుకో వచ్చు . మనం సుఖజీవనం సాగించ
గలిగితే , మనం మన తర్వాతి తరాలకు కారణం కాము కదా !
 అంటే ప్రారబ్దాన్ననుభవించ వలసిన పనిలేదు .
            **********
ప్రతి మనిషి జీవితానికీ
 ' ఆజీవితంతో లంకె పడిన ముందు , వెనక జీవితాలున్నవి ' .
వైవాహిక జీవితానికి సన్నధ్ధం కావడమంటే ,
అదే _ బిడ్డల్ని కనడానికి ముందు ,
శారీరక మానసిక దారుఢ్యాలనూ ,
బుధ్ధి బలాలనూ ,
ఆరోగ్య సౌభాగ్యాన్నీ ,
కళాకౌశలాలనూ ,
వృత్తి నైపుణ్యా లనూ ,
తరువాతి తరాలకు అందించ గలిగే
 పటిష్ట జీవన శైలిని ముందుగా అలవరచుకోవాలి .
నాజీవితం నాయిష్టం అనుకుంటే .....
ఎలా పడితే అలా బతకడానికి అలవడితే .....
తరువాయి తరాలు కూడా
ఆ " భయంకర ఫలితాలు " అనుభవించవలసి ఉంటుంది .
తస్మాత్ జాగ్రత్త !

4, డిసెంబర్ 2015, శుక్రవారం

ఓరిమి లేదు కాస్తయిన .....

ఓరిమి లేదు కాస్తయిన  ,  ఒఠ్ఠి యహంకృత వాక్స్రవంతిలో
తీరిక లేదు వేరొకరు తెల్పిన దేమొ వినంగ  ,  విన్ననూ
వారిది యెంతమాత్రమును వాదన కెక్కదు ,  తామె యింతకున్
నేరిచినట్టి వారమను నిక్కు _ కనంగ వివేకులందరున్ .

బుధ్ధిమయ సాహితీ లోక మిద్ది , కాని
వెకిలి బుధ్ధుల వికృత వివేకములకు
బుధ్ధి మాలినదయపోయె ,  యొద్దిక కొర
వడిన దీతెల్గు బ్లాగు ప్రపంచమిపుడు .

చిన్న ' అప్రిషియేషను ' చేర్చి , తగిన
వ్యాఖ్య రాయుట మంచిదా ? పాండితీ ప్ర
కర్ష చూపించు నట్లు వ్యాఖ్యలను పెట్టి
పరిహసించుట మంచిదా పండితులకు ?

ప్రాత  _ లో  దురాచారాల బాట వదిలి
క్రొత్త విజ్ఞాన రోచిస్సు కూర్చి పేర్చి
మానవత్వ  విలువలే ప్రమాణములుగ
వైరములు వీడి  రచనలు వరలు గాత

2, డిసెంబర్ 2015, బుధవారం

ఎవడురా మేథావి ? .....




ఎవడురా మేథావి ?  భువన మోహను గూడ
తనదు మోసానికి తార్చు వాడ ?
ఎవడురా మేథావి ?  తవిలి జ్యోతిష్యాది
దుర్మార్గ విద్యల దొర్లు వాడ  ?
ఎవడురా మేథావి ? ఏకష్టమెరుగక
పరుల కష్టము మీద బ్రతుకు వాడ  ?
ఎవడురా మేథావి ?  ఇల మనుజుల మధ్య
కుల భేదములు జూపు కుటిల తముడ  ?


కాదు..... తిండి బట్టలు , సౌఖ్యాలు  భువికి
నిచ్చు కొరకు  తర తరాలు నిచ్చలు శ్రమ
జీవియై వెల్గు వాడె మేథావి  _  ఎవడి
' బుధ్ధి ' దుర్మార్గ పథమున పోదొ వాడు .












29, నవంబర్ 2015, ఆదివారం

వెక్కిరింతలు కొన్ని వెటకారములు కొన్ని .....

వెక్కిరింతలు కొన్ని వెటకారములు కొన్ని
పేర్చి నోటి దురద తీర్చు వారు
వదరు కూతలు కొన్ని వాచాలతలు కొన్ని
వార్చి  అహంభావ మేర్చు వారు
కించ పరుచ కొన్ని  కించ పడగ కొన్ని
తలకెత్తుకొని మోసి తనియు వారు
పాండిత్యములు కొన్ని  పరిహాసములు కొన్ని
కవ్వించి వెకిలిగా నవ్వు వారు

ప్రాత సంప్రదాయపు వర్గ పండితులును
క్రొత్త విజ్ఞానమయ వర్గ కోవిదులును
లంకె కుదరక తిట్ల పురాణములకు
దిగుట యిదియేమి కర్మరా తెలుగువాడ .

13, నవంబర్ 2015, శుక్రవారం

ఈన గాచి నక్కల పాలయిన.....

ఆనాటి నేతలు ప్రాణాలకు తెగించి

ఉద్యమాలందు ముందురికినారు

ఆనాటి కవివరుల్ వేనోళ్ల నినదించి

ప్రజలను చైతన్య పరచినారు

ఆనాటి యువత వీరాధి వీరత్వ ము

రకలెత్త నిలిచి పోరాడినారు

ఆనాటి మహిళలు మేని యాభరణాల

నొలిచిచ్చి అండగా నిలిచినారు


మొనసి ధన మాన ప్రాణముల్ తృణము గాగ

నెంచి స్వాతంత్ర్య సమరాణ నిల్చి నారు

భరత మాతృ శృంఖలముల సరము త్రెంచి

స్వేచ్చ , స్వాతంత్ర్య ఫలముల నిచ్చి నారు .


గాంధి విలువలు , జవహరు గారి స్ఫూర్తి ,

పరగ సర్దారు ధీరత్వ పటిమ  నిలిచి 

భారతావని కీర్తి వైభవము గాంచు

నంచు నూహింప బడియె , గానది చివరకు


స్వార్థములు దప్ప జనహిత పరత లేని 

నిండు వ్యాపార వేత్తలు నేత లైరి

ఈన గాచి నక్కల పాలయిన విధముగ

పాలకుల జేరె స్వాతంత్ర్య ఫలము లెల్ల .


విద్య , వైద్యాలె కాదు భావింప నీళ్ళు

కూడ కొన వలసిన బ్రతుకులుగ మార్చి

సొంత వ్యాపార సామ్రాజ్య మెంత గొప్ప

గా జరుపుకొను చుంటిరో గద ప్రభువులు .

11, నవంబర్ 2015, బుధవారం

విజ్ఞత యను దీపావళి వెలుగు గాత !


రఘువంశ సోము డా రాముడేలిన భూమి
సీతా మహా సాధ్వి మాతృ భూమి
గీతా ప్రబోధి శ్రీ కృష్ణుండు జన్మించి
ధర్మంబు నిలిపిన కర్మ భూమి
సిధ్ధార్థు డుదయించి బుధ్ధుడై జగతికి
దారిచూపించిన ధర్మ భూమి
వేదాది విఙ్ఞాన శోధనల్ విరిసి _ ప్ర
పంచ గురువయిన భరత భూమి

మొదటి నుండి దుర్మార్గ విముక్తమై  వె
లుంగు భూమి , యిపుడు గూడ భంగ పడక
వివిధ సామాజిక రుజలు వీడి ,  ప్రజల
విజ్ఞత యను దీపావళి వెలుగు గాత !

6, నవంబర్ 2015, శుక్రవారం

రామ ! రఘురామ ! శ్రీరామ ! రామ ! రామ !









ఈరేడు లోకాల నేకపత్నీవ్రత
మొక్క రామునికిగా కొండులేదు
ఒక్కటే మాటగ నొక్కటే శరముగ
నొక్కరాముండుగా కొండులేరు
ధర్మంబు దప్పని ధరణీశు డిలలోన
నొక్కరాముండుగా కొండులేరు
రక్షించు విభులలో రాణకెక్కిన యతం
డొక్కరాముండుగా కొండులేరు

నామజపమాత్ర తరియింప నాశ్రయ మిడ
నొక్కరాముండు తప్ప వేరొండు లేరు
పల్లె పల్లెన గుడులలో భజనలంద
నొక్కరాముండు తప్ప వేరొండు లేరు .


రాముడేలిన రామరాజ్యమందంతట
నెల మూడు వానలు నిలిచి కురిసె
రాముడేలిన రామరాజ్యమందంతట
ధర్మంబు నాల్గు పాదాల నడిచె  
రాముడేలిన రామరాజ్యమందంతట
ప్రకృతి సుభిక్షమై పరవశించె
రాముడేలిన రామరాజ్యమందంతట
ప్రజలలో సుఖ శాంతి పరిఢవిల్లె

నాడు రాముడే రక్షణ , నేడు రామ
నామ మా రాముకంటె కనంగ శత స
హస్ర మెక్కుడై నిల్చి , మహా మహిత ప్ర
భావ శీలమై రక్షించు భక్త జనుల .


శ్రీరామ పట్టాభి షేక చిత్తర్వుతో
యిళ్ళలో జేరెద రిచటి జనులు
తొలుదొల్త శ్రీరామతో మొదుల్ బెట్టక
యెట్టి వ్రాతలు గనుపట్టవిచట
పలుమార్లు రాముని ప్రణుతించి ప్రణుతించి
నిద్రకు జారుట నియతి యిచట
రామనామమ్ములు రంజిల్ల భజియించి
మంచాలు దిగుదురు మనుజులిచట

మరణ శయ్యను గూడరామా యనుటను
మాట గోల్పోవు చున్నను మరువ రిచట
యిచటి జన జీవనమున మమేకమయ్యె
రామనామమ్ము శ్రీరామ రామ రామ .