14, ఏప్రిల్ 2019, ఆదివారం

రామనవమి శుభాకాంక్షలు

శ్రీరామపత్ని జనకజ
గారాముల భూమిపుత్రి కమనీయ దయా
వారాశి సీత సతియై
శ్రీరాముని నామ మహిమ శ్రీకరమయ్యెన్ .

శ్రీరామబంటు అంజన
గారాముల కూర్మిసుతుడు కరుణాంబుధి శ్రీ
మారుతి భజియించి కొలువ
శ్రీరాముని నామ మహిమ శ్రీకరమయ్యెన్ .

రామ నామ స్మరణ రాజిల్లి రంజిల్లి
'భారతీ'య తత్త్వ ఫణతి విరిసె  ,
జనక రాజ తనయ ననిలాత్మజుల గూడి
రామనామ మెంతొ రమ్యమయ్యె .

శ్రీరాముడు మారాముడు
శ్రీరాముడు హనుమ హృదయ సీతా రాముం
డారాధ్యుడు పుడమి సుతకు
ఆరాధ్యుడు సకలజగతి కండయు నతడే .

5, ఏప్రిల్ 2019, శుక్రవారం

ఉగాది శుభాకాంక్షలు



చెఱకు గడకు మావి చిగురుటమ్ము దొడిగి
పుడమి నాట విడిచె పోకి రొకడు
ప్రకృతి రమణి తనువు పరవశించి యిలకు
నవ వసంత శోభ లవతరించె .

సంఘటితం కండి




సంఘటితం కండి
---------------------
బలిజలు  పుట్టుకన్  విమల పావని గంగకు సోదరుల్ , మహా
బలి తల కెక్కి త్రొక్కిన శుభంకర విష్ణు పదోద్భవుల్ , ధరా
విలసిత జాతి , విద్యల వివేకములన్ కడు ఖ్యాతి గాంచి , భూ
తలమున ప్రాభవమ్మొలుక తాము వసించిరి శౌర్యవంతులై .

రాయల రాజ్యలక్ష్మి గత ప్రాభవ మంతయు కాపుజాతితో
శ్రేయము బొంది యున్నతికి జేరెను , కాపుల ధైర్యసాహసాల్
సాయము గాగ  గెల్చెను విశాల ధరాస్థలి రాయ భూపతుల్ ,
ధీయుతులై చరిత్ర నినదింపగ వెల్గిరి కాపు సోదరుల్

తెలుగుల సాంస్కృతీ విభవ దీప్తులు - కాపుల శౌర్య విక్రమో
జ్జ్వల ఘన కీర్తి జన్యములు - సంగర రంగము నందుగాని , శ్రీ
విలసిత కాంతిమత్ విపణి వీధుల యందున గాని , వేష భా
షల లలితేందిరా కళల చాయల గాని , చరిత్ర గాంచినన్ .

కుజన రాజన్యుల కుత్తుకల్ గోసిరి
రాయల సంగ్రామ రాజియందు
మణి మయ భూషణ వణిజులై వెలిగిరి
దేశ దేశాల సందీప్తి మెరయ
వేష భాషల కీర్తి వెలుగొంద నిలిపిరి
సాంస్కృతీ వైభవోజ్జ్వలత గదుర
పేద సాదల కింత పెట్టిరి కడుపార
దాన దయా గుణ జ్ఞాను లగుట

శౌర్య విక్రమ ధిషణాది చతురతలును ,
వేష భాషలు , సంస్కృతీ విభవములును
కాపు వర్గాల పెన్నిథుల్ , కలసి రండు ,
సంగరము సేయ , ఎన్నిక రంగ మందు .

తెలగలు , వొంటరుల్ , బలిజ ధీరులు , కాపులు తెల్గు నేలపై
గలరు విశేష సంఖ్యల , సకాలములో తమ శక్తి జూపి , ఈ
మలినపు రాజకీయమును మట్టున బెట్ట మహోగ్ర మూర్తులై
తెలుగు ధరాతలమ్ము వినుతింపగ సంఘటితమ్ము కావలెన్ .

ఇతరుల కాళ్ళవద్ద యసలేల పడుండగ ? , రోష శౌర్య సం
వృతమతులై , స్వయం జ్వలిత వేగ సుసంఘటి తాంతరాత్మతా
స్తుతిమతులై , వినూత్న గతి , వంచకులన్ దిగద్రొబ్బి , భ్రాతలై
సతతము రాష్ట్ర పాలనకు సందడి సేయుడు రాజ్య కాంక్షతో .

ఇదె సమయమ్ము - కాపు విజయేందిర ఆంధ్రప్రదేశ రాష్ట్రమం
దుదయము నొందు దాక , పునరున్నతి బొందెడు దాక , కృష్ణరా
య ధరణి నాధు ప్రాభవ మహా మహనీయత లొప్పు దాక ,  సం
విధ సముదైక్య సంఘటిత వేదిక గావలె కాపు వర్గముల్ .

31, మార్చి 2019, ఆదివారం

మంచి ప్రజాప్రతినిథులను ఆశించడం అత్యాశే .

ఓటు హక్కు గురించీ  – దాన్ని వినియోగించుకోవడం గురించీ అనర్గళంగా ఉపన్యసిస్తున్నాడు మేధావి .
         “ ఓటు హక్కు ప్రతి పౌరునికీ రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం . పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి వ్యక్తీ ఓటరుగా నమోదు కావాలి . ప్రజాస్వామ్య సూత్రానికి ఓటు మూల స్థంభం . ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకున్న దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది . పౌరులందరూ ఎన్నికలలో విథిగా ఓటు హక్కును వినియోగించు కోవాలి ......
        సదరు మేథావికి భారత రాజ్యాంగం గురించీ - పౌరహక్కులూ విధుల గురించీ క్షుణ్ణంగా తెలుసు . మీదుమిక్కిలి ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి పరితపించే మనస్తత్వం .
       నిజమే . ఓటు హక్కు వజ్రాయుధమే . అయితే ఓటరు చేతిలో ఉన్నప్పుడు కాదు . ఓటరు చెయ్యిదాటి నేతకు చేరినప్పుడు . అవినీతికి చేరువైనప్పుడు . ఇదీ ప్రస్తుతం జరిగే ప్రజాస్వామ్య ప్రహసనం .
        రాజకీయ పార్టీలు రెండో మాట లేకుండా అంగబలం అర్థబలం ఉన్న గెలుపు గుర్రాలనే ఎన్నికల బరిలోకి    దించుతాయి .  ఎన్నిఅకృత్యాలు చేసయినా గెలవగల సత్తా ఉండడమే అభ్యర్థిత్వానికి ముఖ్య అర్హత .  అవినీతి మలికి అంటని స్వఛ్ఛత– సేవాతత్పరత , నిరాడంబరత , సంస్కారం – ఇలాంటి ట్రాక్ రికార్డు అవసరం   లేదు.  
రాజకీయ పార్టీలు ఎంపిక చేసే అభ్యర్థిత్వాలు ఇలా ఉంటే ఎవరికి ఓటెయ్యాలి . ఎవరికి ఓటేసినా అది
గెలిచిన వాడి చేతికి వజ్రాయుధాన్నిచ్చినట్టే . వాడు దాన్ని ప్రజలనూ  ప్రజాస్వామ్యాన్నీ నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నాడు . ప్రజాధనం దోచుకుంటున్నాడు .
         పూర్వం న్యాయవాద విద్యనభ్యసించిన వారే ఎక్కువగా రాజకీయాలలోకి వచ్చేవారు . రాజకీయాలలోకి వచ్చిన ఇతరత్రా వారికి కూడా ప్రజాసేవ పట్ల నిబధ్ధతా , అవినీతి ముద్ర పడుతుందేమోననే జంకూ ఉండేది . 
నేడు అధికారం కోసం నేతలు పడే తహ తహ చూస్తూ ఉంటే ఎలాంటి జంకూ గొంకూ కనబడడం లేదు . కేవలం దాహం తప్ప .
        బడా కాంట్రాక్టర్లూ , బడా పారిశ్రామిక వేత్తలూ , లిక్కర్ కాంట్రాక్టర్లూ , చివరకు గూండాలూ రౌడీలూ కిల్లర్లూ
రాజకీయ నేతల అవతారమెత్తి అధికారం కోసం తహతహలాడడం ప్రజాసేవ కోసమే అనుకోగలమా ?
దీన్ని ప్రజాస్వామ్యమని మభ్యపెట్టుకొనాల్నా?   మేథావుల సలహాను పాటించి  ఉన్నంతలో మెరుగైన అభ్యర్థికి        ఓటేసి చేతులు దులుపుకో వలసిందేనా ?  మరేదైనా పరిష్కారం ఆలోచించవలసి ఉందా ?
       అసలీ రాజకీయ పార్టీలవ్యవస్థను నిషేధించాలి .  అభ్యర్థులంతా స్వతంత్రులుగా బరిలోకి దిగాలి . నామినేషన్ దశ లోనే  సమగ్ర పరిశీలనద్వారా  వివిథ అంశాలలో  అభ్యర్థిత్వాన్ని మదింపు వేసి  పోటీ చేయడానికి అర్హతను నిర్థారించాలి . ప్రచారార్భాటాలనూ కోట్లాది రూపాయలు వ్యయం చెయ్యడాన్నీ నిషేధించాలి .  స్వయంగా గాని
మీడియా ద్వారా గానీ  ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నియోజక వర్గ ఓటర్లను కలిసి అభ్యర్థించడం మాత్రమే
చేయాలి . పోటీలోని అభ్యర్థులంతా వడకట్టబడిన మంచి అభ్యర్థులైనప్పుడు గెలుపొందిన అందరూ ప్రజాసేవకుపక్రమించడాన్ని అనుమానించవలసిన అవసరముండదు .
       ఎన్నికలు పూర్తయి ఫలితాలు ప్రకటించిన తర్వాత గెలుపొందిన ప్రజాప్రతినిధులంతా ముఖ్య మంత్రిని         ఎన్నుకోవడం , ముఖ్యమంత్రి మంత్రులను ఎన్నుకోవడం – ఈ విధంగా పార్టీ రహిత ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేసుకోవచ్చు . 
       ఇలాంటి ఏదైనా మంచి ఎన్నికల సంస్కరణ అమలై   మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఏర్పడి నప్పుడు తప్ప    ఇప్పుడున్న రాజకీయ పార్టీల వ్యవస్థలో మాత్రం   మంచి ప్రజా ప్రతినిధులను ఆశించడం , ప్రజాధనం దోపిడీని నివారించడం  అత్యాశే అవుతుంది .


   

8, మార్చి 2019, శుక్రవారం

మహిళా దిన శుభాకాంక్షలు .....


అత్తలు కోడళ్ళు ఆడబడుచులు పర
         స్పరము ‘ సహకరించి ‘ బ్రతుకు రోజు
ఇరుగింటి పొరుగింటి ఇల్లాళ్ళ కష్టాలు 
          ఇంతుల ‘ కానంద ‘ మిడని రోజు
పక్కింటి తగవులు పడతికి టిక్కెట్టు
          లేని ‘ వినోదమ్ము’ కాని రోజు
మనకెందు కంటూనె  మాట పొల్లులు వోక
           పలు ‘ ప్రచారాల ‘ పాల్పడని రోజు
చెలగి ‘ ఈర్ష్య లసూయలు  స్త్రీకి సహజ ‘
మని  జగమ్మున భావింప బడని రోజు
‘ స్త్రీకి స్త్రీ శత్రు ‘ వను పేరు చెఱగు రోజు
మహిళ మహిమాన్వితా మూర్తి , మాన్య చరిత .

22, ఫిబ్రవరి 2019, శుక్రవారం

తలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు




నిలిచి బ్రంహ్మాండ మంతయు నిండి యున్న
ముగురు తల్లుల శక్తికి మూల మీమె
ఎల్ల లోకములకు తల్లి యీమె యనుచు
దలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు

వేద విహిత విధి విధాన విరచిత శిఖి
శిఖల జ్వాజ్వల్యమాన రోచిషుల నడుమ
మహిత యాగాగ్ని గుండ సంభవ యగుటను
దలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు .

రక్త సింధూర వర్ణంపు  రామణీయ
క , లలిత , మనోఙ్ఞ రూపము  , కనక ఖచిత
మణిమయ కిరీటమున ,  అమ్మ విభవమ్ము
దలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు .

పసుపు కుంకుమల  , సుగంధ పరిమళముల
నెల్ల వేళల   మైపూత   లుల్లసిల్ల  ,
దీప ధూపాల తోడ సందీప్త యగుట
దలచి కుల్లూరు పోలేరు తల్లి గొలుతు .

14, ఫిబ్రవరి 2019, గురువారం

ఫొటో పద్యం



పసుపంచు ముదు రాకుపచ్చ కోక , హరిద్ర
వర్ణంపు రైక  ఠేవలను జూచి
కడు మనోఙ్ఞపు తనూ ఘన విభవపు చిరు
చెమటల కమనీయ సిరులు జూచి
తలమీది మూటపై గల వామ హస్తంబు
కుడిచేత కొడవలి కులుకు జూచి
గనిమపై నలవోక గమకించు గరిత జూ
చి , ప్రకృతి పులకించి చెలువు మించె ,

చుట్టు పట్టుల పచ్చని శోభ లొసగు
చేలు తలలూచె , నందంపు జిలుగు జూచి
వందలాదిగ బ్లాగ్ కవి వరులు మురిసి
పద్యములు గట్టెదరొ యేమొ భావుకులయి .

19, జనవరి 2019, శనివారం

మల్లెలపై పద్యాలు .....



మల్లెలోయమ్మ మల్లెలు , మల్లె విరులు ,
మనసు దోచేటి మల్లెలు , మగువలకును
మగలకును , మనోల్లాస సమాగమంపు
సరసగుళికలు , రమణీయ విరి కళికలు .

మల్లెలపై పద్యావళు
లల్లుడు భాషా మతల్లి కాహ్లాదముగా
నెల్లెడల తెన్గు పరిమళ
మల్లన తగ వెల్లి విరియ నాంధ్ర కవి వరుల్ .

మల్లె పూల బుట్ట  తెల్లని పరిమళ
ముల్లసిల్ల మీకు ముందు గలదు
అల్లి తెలుగు పద్య మల్లె దండలు గ్రుచ్చి
తల్లి మెడను జేర్చ దన్యత గద !

మల్లియలార ! మీకు ప్రతిమానముగా సరివచ్చు పూలు లే
వల్ల ధరాతలంబునను , నా త్రిదివంబునగాని , పార్వతీ
వల్లభుడే వరించు మిము వాసిగ పూజకు , మల్లికార్జునుం
డుల్లము మెచ్చి వేడ్క కురియున్ వరముల్ మిము దాల్చినంతనే .

నల్లని వాల్జడన్ తురిమి , నాణ్యముగా దిగజార్చ , పోడుముల్
మొల్లములై యెసంగు కడు ,  ముగ్ధ మనోహర రూపలాలస
త్సల్లలితోరు రోచిషులు సాధ్యమ , నీ సయిదోడులేక , యీ
ఫుల్ల సరోజ నేత్రలకు ,  పూవన నీవె మనోఙ్ఞ మల్లికా !


12, జనవరి 2019, శనివారం

మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు


హితులారా ! యీ సంక్రాం
తి తమకు శుభము లొనగూర్చి , త్రిదివసములున్
సుత బంధు తతుల తోడుత
అతిశయ సౌఖ్యాలవాల మై వెలుగొందున్ .

8, జనవరి 2019, మంగళవారం

ముదిమి పైకొన్న .....

అళి నీల శిర సార తళతళల్ ధవళమౌ
నుదుటిపై ముడతలు పొదువు కొనును
కనుచూపు తగ్గును కన్నెడ పైకొను
చెక్కుటద్దమ్ములు చెలువు దప్పు
కాళ్లును సేతులు కీళులు సడలును
నడుము డస్సి నాణ్యము నశించు
ఉదరమ్ము పదపడి యుబ్బి చరించును
తిన్న దరుగని జబ్బు తీవ్రమగును

తరమ తప్పించుకొన ? హితా ! , తర తరాల
మనుజ జన్మమ్ము లింతయే , మార్పు నిజము ,
ఏ వయస్సున ముచ్చటల్ ఆవయసువి ,
సర్దుకుని మనుటె ఘనము , శాంతి యుతము .

31, డిసెంబర్ 2018, సోమవారం

మిత్రులకు క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు

శ్రీరస్తు శుభమస్తు శ్రీచిద్విలాసినీ
కొంగ్రొత్త వర్ష ! రా ! కొలువు దీరు ,
పుడమికి నగణిత భోగ భాగ్యాలిచ్చు
కాల చక్రమ ! మమ్ము గావ రమ్ము ,
 క్రమగత విహిత సక్రమ మహితర్తు కా
ల విలసన ప్రభా లలిత  !  రమ్ము ,
శోభన ప్రకృతీయ శుభ ప్రశాంతత లివ్వ
రావమ్మ నవ్యాబ్ది ! రమ్య గతుల ,

వచ్చి భూమి పయి సుభిక్ష మిచ్చి , సకల
ప్రాణి కోటి మనుగడకు భయరహిత మ
నోఙ్ఞ జీవన దాతవై నూత్న వెలుగు
రేఖలు గురియుము విభావరివయి తల్లి !

22, డిసెంబర్ 2018, శనివారం

వృక్షో రక్షతి ....




వృక్షో రక్షతి ......
--------------
బ్రతు టెన్నాళ్లొ తెలియదు , బ్రతుకు వంద
లాది యేళ్లు వృక్షాలు , ఫలాల నీడ
ల నొసగుచు , నాటిన సుజనుల బ్రతికించి ,
మేలు చేసిన వారికి మేలు సేయు .

 అమ్మవార్ల గుడుల కటుప్రక్క నిటు ప్రక్క
రెండు నూర్ల మ్రొక్క లిరవు గాగ
నాటి పెంచినాను , నయనారవిందాలు
విచ్చు కొనును , చూచు సచ్చరితుల .

వేప కానుగ నేరేడు వెలగ జామ
నిమ్మ  మామిడి యరటి దానిమ్మ  మొదలు
గాగ వృక్షజాతులు , ననేక సుమ తరులు
నాదు జన్మ ధన్యత నొందె నని దలంతు .

14, డిసెంబర్ 2018, శుక్రవారం

ఈ నలుగురూ .....



నిను గన్న నీ తల్లి  నిరత పూజిత యగు                    అమ్మయై తనరారి అమృత మొసగు
నీతోడ బుట్టి యనితర ప్రియ మొసగి
సోదరి మధు ఝరీ సుధలు గురియు
నీ కోసమే పుట్టి నీలోన సగమైన
మగువ నీ సర్వస్వ మై మెలగును
నీకు బుట్టిన నీదు రాకుమారియె నిన్ను
తరియింప జేయును మురియజేసి 
                           
తల్లియై , తోడబుట్టయి , తనర పెళ్ల
మై , మురియ కూతురై  నిన్ను మనిషిజేయ
నీ నలుగు రున్న నే గద ! నీ బతుకు వె
లుంగును మగాడ ! లేనిచో లోపమె గద !

21, నవంబర్ 2018, బుధవారం

మా శివాలయంలో కూచిపూడి ప్రదర్శనం





          మా చిరంజీవులు కుమారి ' తిరుమలశెట్టి ఆముక్త ' ,
                  తోట పూర్ణసాయి ల నృత్యప్రదర్శనం                     

11, నవంబర్ 2018, ఆదివారం

కుల్లూరు శివాలయంలో .....


                     ఆహ్వానం                 
              కుల్లూరు శివాలయంలో                                  19/11/2018 న కార్యక్రమాల సమయపాలనం
                        *****
1.మహారుద్రాభిషేకం : ఉదయం 6 నుండి 9 వరకు
2.అల్పాహారం : 9 నుండి 10 వరకు
3. రుద్రయాగం : 10-30 నుండి మద్యాహ్నం 1వరకు
శ్రీ అల్లు . భాస్కర రెడ్డి గారి అథ్వర్యంలో
4 . ఉసిరిపూజ  , కార్తీక వనభోజనాలు :
     మధ్యాహ్నం 1 నుండి 3 వరకు
5 . ప్రవచనాలు : సాయంత్రం 4 నుండి 5 వరకు
6 . చెఱువులో కార్తీక దీపోత్సవం : రాత్రి 5-30 నుండి 6 -30 వరకు
7 . రాత్రి అల్పాహారం : రాత్రి 6 - 30 నుండి
 8 . శివాలయంలో దీపోత్సవం : రాత్రి 6-30 నుండి
 9 . రాత్రి 7 నుండి సాంస్కృతిక కార్యక్రమాలు .
భరతనాట్య , కూచిపూడి ప్రదర్శనలు
         1 .తోట .పూర్ణసాయి (ఫోటో)
         2 .తిరుమలశెట్టి . ఆముక్త (ఫోటో)
          3 .
తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే అన్నమాచార్య
కీర్తనలు ,
ఇంకా ..... అనేక దైవ కార్యక్రమాలు .






6, నవంబర్ 2018, మంగళవారం

దీపావళి శుభాకాంక్షలు




ఇది దీపావళి , నూనె దీపములు వెల్గించండి , భూమాత ది
వ్య దిదృక్షా సమలంకృతా విభవముల్ వర్థిల్లు , వేవెల్గు లీ
ను , దిగంతాల మనోఙ్ఞతల్ పరచు , ఙ్ఞానాబ్జాలు దీపించు , సం
పద లక్ష్ముల్ మన గుమ్మముల్ నిలుచు , నీ పర్వంబు మోదంబగున్ .

ధరణి పొగచూరి దట్టమై మురికిబారి ,
జీవములు వోయి , విష పవనావశిష్ట
కారణమగు టపాసులు కాల్చవద్దు ,
కోరి చేజేతులా చావు కోరవద్దు .

ఆనంద తుందిలమ్మయి ,
మేనులు పులకింప , నుద్యమించి , కుటుంబా
లూనిక దీపాల నడుమ
పూని నిలిచి , వెలుగు సిరుల భోగింప నగున్ .

సత్యభామ నరకాసుర వధ


గరుడుపై నిడుచక్కి గగనాని కెగబ్రాకి
కోపానల జ్వాల కోల జేసి
వింటి నారికి జేర్చి మంటికి మింటికి
కణ కణ విస్ఫులింగాలు రాల
నాధుండు డస్సి విణ్ణాణంబు వీక్షించ
గరుడుండు గువ్వయి కానుపింప
జడిసి సురాసురు లుడిగి భువి బడంగ
బ్రహ్మ మేల్కాంచి విభ్రమము దొడర

కదన రంగాన గల నరకాసురుండు
నీ కొడుకునమ్మ ! చంపొద్దని యడు గిడుచు
ఏడ్చి గీపెట్టి చేతులు మ్రోడ్చు చున్న
చిత్రవధ జేసె ' కొడుకును , చెడును ' - సత్య .

చెడును శిక్షించు పట్టున పుడమి తల్లి
యే వివక్షను చూపలేదే ! విడువక ,
రావణుని చావు పట్టున రమణి సీత
తల్లి పుడమిని తలపించె తాను కూడ .

30, అక్టోబర్ 2018, మంగళవారం

ఆహ్వానం


వీక్షకులు ,
మిత్రులు ,
మరియు యావత్
బ్లాగు లోకానికీ
ఆహ్వానం
*****

మా కుల్లూరు శివాలయంలో
ఈ నవంబరు 19
కార్తీక సోమవారం
మహా రుద్రాభిషేకం
రుద్రయాగం
కార్తీక వనభోజనాలు
శివ పంచాక్షరీ మంత్రజపం
ప్రవచనాలు
కార్తీక దీపోత్సవం
సాంస్కృతిక కార్యక్రమాలు
నాచే నిర్వహించబడును
రండి , ఒకరోజు పరమేశ్వర
సన్నిధిలో ఆనందంగా
గడుపుదాం .

23, అక్టోబర్ 2018, మంగళవారం

ఆరోగ్యంగా బ్రతుకుదాం ..... ఆనందంగా జీవిద్దాం




తల్లి దండ్రి మనోల్లాస తన్మయత్వ

తాత్వికత నుండి జన్మించి ధరణి బడిన

“ మనిషి   తన ప్రమేయమె లేక జనన మాది

తెచ్చుకొన్న లక్షణముల  దిరుగు చుండు



తర తరాల నాటివి , తల్లి-దండ్రి ద్వార

రూపు , లలవాట్లు , బుధ్ధులు , రోగములును

సర్వము క్రమాను గతముగా సంక్రమించి

మనుట “ విధిరాత , ప్రారబ్ధ “ మనిరి , యైన -



పెండ్లియై నీవు నీభార్య ప్రేమ మీర

బిడ్డలను గని “  ఇవి   సంక్రమింప జేయ

న్యాయమా ?  సర్వ శుభ లక్షణాన్వితులుగ

పుట్టి జీవింప జేయగా బోలు గాని  



తర తరాల నుండి తరలి , దరికి జేరి

మిమ్ము బాధించు “ అట్టి దైన్యమ్ము  మార్చి ,

మిమ్ములను మీరు తీర్చి , మీ బిడ్డ బ్రతుకు

దిద్దుకొనుట మీ చేతిలోదే , తలంప





మంచి యలవాట్లు , దైహిక – మానసికపు

సంతసము గూర్చు నారోగ్య సత్యములను ,

కోరికల మీద సంతృప్తి కూడి ,  కనిన

సంతు , శుభ లక్షణోపేత జనిత మగును



  రూపు , లలవాట్లు , బుధ్దులు , రోగములును

సర్వమును సంతతిని కూడి సంక్రమించు 

ననెడు సత్యాన్ని మరువని జనుల జాతి

దిన దినాభివృధ్ధి గను ,  సందియము లేదు







20, అక్టోబర్ 2018, శనివారం

నా పద్యం సొగసు లీని , గుభాలిస్తోంది


' పలుకు ' నన వేసి , ' మొగ్గయై ' భావ మొదిగి ,
' పద్య 'మై పూవు విడిసె - నిప్పగిది కవి - మ
నోజ్ఞ రుచిర పరిమళ వినూత్న భంగి
రస మయము జేసె తెల్గు నేలలు తరించ .

మొనసి నాబోటి వేవురు ముదముతోడ
పద్యమందలి రసభావ విద్యమాన
మథువు ద్రావి , తనిసి , కవి విథము దెలిసి ,
తనివి తీర వొగుడుదుము తలలు వంచి .

ఎంత రమణీయ మీ పూల పుంత !  మున్ను
నన్నయాది కవీంద్రులు సన్నుతముగ
తెల్గు నేలల బెంచి ఖ్యాతిలగ జేసి
తెలుగు పద్య పూదోటలు తీర్చినారు .

కోరి బుధు లనంగ హేరాళమై యిప్డు
పద్య మెవ్వడేని పరిఢవిల్ల
వ్రాసె నేని వచ్చి రాయిడి జేతురు
తప్పు తప్పు తప్పు తప్పటంచు .

కాస్త యెప్పుడైన స్కాలిత్యము దొరలు
అంత మాత్ర మతని సుంతయేని
సారహీను డనుచు చావగొట్టంగ నీ
ఘనులు తప్పెరుగని వినుతు లేమి !

తప్పు వెదుకుచు జదువు బుధవర ! కాస్త
దోరణిని మార్చుకో ! పద్యసారము గను !
మేలు భజియించు ! తలయూచు మించుకైన !
నిండు  రంథ్రైక ధ్యాసలో నుండి తలగు !

18, అక్టోబర్ 2018, గురువారం

బ్లాగు బందుగులకు విజయదశమి శుభాకాంక్షలు


మా కుల్లూరు
----------------
ఖణ ఖణ ఖణ మంచు వినిపించు తప్పెట్ల
కదన శబ్దాలకు కాళ్ళు కదులు
ఫెళ పెళ పెళ మని విసురు పటాకత్తి
చండ ప్రహరలకు గుండె లదురు
ధగ ధగ ధ్వాంత మధ్యాంత్య శోభలతోడ
విను వీథిలో ఔట్లు ప్రేలు సొదలు
గిడి గిడి మేళాలు  కీలుగుర్రాలును
బుట్ట బొమ్మల కేళికాట్ట హాస

ములు కనంగను  ముసిలి యొగ్గులును కూడ
ఉరక లెత్తుదు రుత్సాహ పరవశమున
తవిలి దుర్గాష్టమిని  మహర్ణవమి నాడు
నొనరు కుల్లూరి దశరా మహోత్సవములు .



14, అక్టోబర్ 2018, ఆదివారం

మా విద్విషావహై .....



ఎనిమిదో తరగతి గదిలో పిల్లాడి ఏడ్పులూ , పెడబొబ్బలు .
ప్రక్క గదిలోని నేను                                                                                                     
పాఠం ఆపి , వరండాలోకి వచ్చి , కిటికీ లోంచి చూశాను .
ఒక పిల్లాడు నేలమీద దొర్లుతూ పెడ బొబ్బలు పెడ్తున్నాడు .
మా స్కూల్లో పిల్లలు కూర్చుందుకు ఏరూముకూ బల్లలు లేవు .
టీచర్ వాడ్ని కాళ్ళతో తంతున్నాడు .
నేను వేగంగా గది గుమ్మం లోకి చేరుకున్నాను .
సార్ , అంటూ బిగ్గరగా గద్దించాను .
నన్ను ఊహించని అతడు సడన్ గా నావైపు తిరిగేడు .
రండిలా , అని మళ్ళీ గద్దించాను .
వచ్చాడు .
' ఏమిటి మీరు చేస్తున్నది?'
' హోంవర్కు చేయలేదు పైగా ఎదురు మాట్లాడు తున్నాడు సార్ '
' అయితే?'
' అయితే ఏమిటి , దండించ నక్కరలేదా '
' దండించడమంటే పిళ్లాడ్ని కాళ్ళతో తన్నడమా '
నా స్వరంలో గౌరవం మారింది .
సంబోధనలో ఏకవచనం ప్రవేశించింది .
' ఎవరిచ్చారు నీకీ అధికారం'
' నీవసలు టీచరువేనా '
' టీచరు సంగతి సరే , నీవసలు మనిషివేనా '
నాకోపం తారా స్థాయికి చేరింది .
అక్కడ్నుంచి వెళ్ళి పొయ్యాడు .
అతడు చాలా జూనియర్ .
                   -----
      ఈ సంఘటన జరిగిన రెండు గంటల తర్వాత  నా వద్దకు వచ్చాడు .
సారీ చెప్పాడు .
పిల్లలను కొట్టడం నేరమనీ , కార్పోరల్ పనిష్మెంట్ నిషేధించ బడిందనీ ,
ఒక్క ప్రధానోపాధ్యాయునికి మాత్రమే కేన్తో అరచేతిపై మాత్రమే రెండు
చిన్న దెబ్బలు వేసే అధికారముందనీ , అదీ ప్రవర్తనకు సంబందించి
మాత్రమే ననీ వివరించి ఇంకెప్పుడూ ఇలా ప్రవర్తించ వద్దని చెప్పాను .
సదరు టీచర్ తదాదిగా నన్ను రోల్ మోడల్ గా తీసుకున్నాడు . మంచి
టీచర్ గా పేరు గడించాడు .
                     -----
విద్యా సంస్థలలోనూ , వైద్యశాలలలోనూ పని చేసే సిబ్బందికి ఉండవలసిన  
మొదటి లక్షణం ఓర్పు . పురుషుల కంటే మహిళలకు ఓర్పు అధికం అంటారు .
అందు వల్లనే నేమో పూర్వం ఈ రెండింటిలోనూ ఎక్కువగా మహిళలనే తీసుకునే వారు .
అసలీ టీచర్లు పిల్లల విషయంలో ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు ? పిల్లల విషయంలో
కక్ష – అనే పదానికే ఆస్కారం లేదు కదా . అల్లరి చేయడం బాల్య చాపల్యం
కిందికి వస్తుంది . నిజమే , పిల్లలు విసిగిస్తారు . అంతమాత్రాన , వాళ్ళు
పిల్లలు అనే విచక్షణ కోల్పోతే ఎలా ఈ టీచర్లు ?
ఆకట్టుకునే బోధనా చాతుర్యం , బోధనానుభవం ఉన్న ఉపాధ్యాయుణ్ణి
విద్యార్ధులు అమితంగా ఇష్ట పడుతారు . ఆ సార్ క్లాస్ రూంకు వస్తున్నాడంటే
విద్యార్థుల ఉత్సాహం పురి విప్పి నాట్యం చేస్తుంది .
తరగతి గది లోకి వస్తూనే , పాఠ్యాంశానికి సంబంధం న్నా , లేకున్నా
ఒక క్రొత్త విషయాన్ని తీసుకొచ్చి ఆసక్తి కరంగా వినిపించి పిల్లల మస్తిష్కాలను
తన బోధన వైపు మళ్ళించు కుంటాడు , మంచి ఉపాధ్యాయుడు . అతని బోధన
ఆసాంతం జీవ కళ ఉట్టి పడుతూ కొన సాగుతుంది . ఉపాధ్యాయునిలోని ఈ
సామర్ధ్యం అతన్ని విద్యార్ధులకు దగ్గరగా చేర్చి , ఒజ్జలలో మణిపూసగా
నిలుపుతుంది . ఉపాధ్యాయునిలో దాగి ఒక సహజ నటుడుండాలి .
అవసరమైనప్పుడు ఆడాలి , పాడాలి . ఉపాధ్యాయుడు ఒక సజీవ విజ్ఞాన
సర్వస్వం కావాలి . ఇతనికి తెలియని విషయమంటూ లేదని అనిపించుకోవాలి .
ఉపాధ్యాయునికి సునిసిత పరిశీలనా జ్ఞానముండాలి . డే టు డే క్రొత్త విషయాలను
నేర్చుకుంటూ అప్ డేటెడ్ గా ఉండాలి . ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్ధి .
                      -----
అన్నింటి కంటే , పిల్లల యెడ ప్రేమ దయ ఉండాలి . నిరంతరం విద్యార్ధులకు
మార్గదర్శనం చేస్తూ ఉండాలి . క్లాస్ రూంలో పిల్లాడి వెనుకబాటు తనానికి
ఒక్కొక్కప్పుడు అతని కుటుంబ స్థితి గతులు , పరిసరాలు కారణంకావచ్చు .
వాడి స్థితి గతులతో నాకేమిటి అనుకునే వాడసలు ఉపాధ్యాయుడే కాదు .
దయామయుడైన ఉపాధ్యాయుడు దండించడం మాని , కారణాన్ని అన్వేషిస్తాడు .
సమస్యను సాధ్యమైనంతలో చక్కజేసి విద్యార్ధిని అధ్యయనోన్ముఖున్ని చేస్తాడు .
ఉపాధ్యాయ వృత్తి ఇతర వృత్తులకంటే భిన్నమైనది . అందుకే,అత్యున్నత స్థాయికి
చేరుకున్నాక కూడా తనకు చదువు చెప్పిన టీచరుకు నమస్కరిస్తాడు విద్యార్థి .
ఈ గౌరవం సమాజంలో ఒక్క ఉపాధ్యాయుడికే లభిస్తుంది.మరి దాన్నికాపాడుకో
వాలంటే నిబధ్ధత ఉండాలిగా .
వెంకట రాజారావు . లక్కాకుల 

సరస్వతీ రూపంలో జగన్మాత .....


నిలువెల్ల తెల్లని వలువలో వెలుగొందు
వాగ్దేవి ! శారదా ! వందనములు ,
తెల్లదామర పైన తేజరిల్లెడు తల్లి !
బ్రాహ్మీ ! సనాతనీ ! వందనములు ,
బ్రహ్మ విష్ణు శివులు ప్రస్తుతించెడి తల్లి !
పరదేవతా ! నీకు వందనములు ,
పద్మ పుస్తక శుక స్ఫటిక మాలల వెల్గు
పరబ్రహ్మ రూపిణీ ! వందనములు ,

జన్మ జర జాడ్యములు వోవ జగతి గాచు
వర సరస్వతీ మాతరో ! వందనములు ,
ప్రాణులందున బుధ్ధి రూపాన నిలిచి
వరలు మూలపుటమ్మరో ! వందనములు .

13, అక్టోబర్ 2018, శనివారం

బ్లాగ్ వీక్షకులకూ , మిత్రులకూ దశరా శుభాకాంక్షలు


వందనాలు తల్లీ .....
-------------------
ఎవ్వార లీవిశ్వ మెంతేని నేర్పుతో
కడు మనోఙ్ఞముగ నేర్పడగ జేసె
ఎవ్వార లీసృష్టి కేడు గడయై నిల్చి
కాచి రక్షించునో కనుల నిండ
ఎవ్వార లీప్రాణు లే సంకటము లేక
చరియించ పాప సంహరణ చేయు
ఎవ్వార లీ ప్రజ కెంతేని విఙ్ఞాన
జ్యోతుల నందించి యునికి నేర్పు

ఆమె లలితా పరంజ్యోతి ఆమె దుర్గ
ఆమె శారద ఆమెయే ఆదిలక్ష్మి
అంతటను నిండి  తనయందె అంత నిండి
వెలుగు మూలపు టమ్మకు వేల నతులు .

దురిత దూర , 'దుర్గ' , దుర్మార్గ నాశని ,
దోష వర్జిత , సతి , దుష్ట దూర ,
సమధిక గుణ దోష సర్వఙ్ఞ , సమభావ ,
సకల జగతి నేలు సాంద్ర కరుణ .

తరణిని తారాధి పతిని
తరచిన తాటంకములుగ దాల్చిన తల్లిన్ ,
పరదేవతను మనంబున
పరి పరి భావింతు బ్రతుకు పండుట కొఱకున్ .

అమ్మా యని ఆర్తి గదుర
అమ్మను నోరార బిలిచి నంతనె యెదలో
అమ్మతనపు వాత్సల్యము
క్రమ్ముకొనగ నెదకు హత్తు ఘనత దుర్గదే .