10, డిసెంబర్ 2020, గురువారం

స్వఛ్ఛ ప్రకృతి

 


చెన్నుందామెరలోని స్వఛ్ఛతలు  ఈస్త్రీయందు గన్పట్టు , సం

పన్నుల్ బంగరు భూషణాలు ధరియింపన్ రాని విణ్ణానపున్

వన్నెల్ , ఆ ప్రకృతీ సమీపగత జీవావాసులందుండుటల్

ఎన్నంగానగు , నీమెకున్ గొలనుకు న్నేవో దోచు సాపత్యముల్ .

మహానటి

 



ఈ మహానటి సాటి రా నెవరు గలరు

హేమ మకుటమ్మ దొడిగె కళామతల్లి

తెలుగుల సినీజగత్తు వో వెలుగు వెలిగె

అరయ సావిత్రివల్లనే ననగ జెల్లు .

ఇదీ మన కథే నట !

బ్రహ్మగారు ఈ భూమి మీద జీవ సృష్టి చేస్తూ మొదటగా

మనిషిని- ఎద్దును- కుక్కను - గుడ్లగూబను పుట్టించి ఒకొక్కరూ నలభై సంవత్సరాలు బతకండి అని ఆదేశించాడు. 

సహజంగా మానవుడు ఓన్లీ 40 ఇయర్సేనా సార్ అన్నాడు.  అప్పుడు బ్రహ్మ గారు ఒకసారి ఇచ్చిన ఆర్డర్ కు తిరుగుండదోయ్ అన్నాడు.

*అక్కడే ఉన్న ఎద్దు నాకు 40 ఏళ్లు ఎందుకుసార్ - ఎప్పుడూ పొలాలు దున్నుతూ, బళ్లను లాగుతూ ముల్లుకర్రతో పొడిపించుకుంటూ - నాకు 20 ఏళ్ళు చాలుసార్ అందోలేదో వెంటనే అక్కడ ఉన్న మానవుడు - ఆ 20 నాకివ్వండి నాకివ్వండి అనగానే - బ్రహ్మ గారు మీలో మీరు అడ్జస్టయితే నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నాడు (ఇప్పుడు మానవుడికి 60 ఏళ్ల వయసయింది).*

*ఆ వెంటనే అక్కడ ఉన్న కుక్క  నాకు మాత్రం 40 ఏళ్లు ఎందుకు  - ఎక్కే గుమ్మం  దిగే గుమ్మం  అందరూ ఛీ ఛీ అనే బతుక్కి 20 ఏళ్లు చాలు అనగానే ... మళ్లీ మానవుడు ఆ 20 నాకే నాకే  అనగానే బ్రహ్మ గారు ఓకే ఓకే అనేశారు ( ఇప్పుడు మానవుడికి 80 ఏళ్ల వయసయింది).*

*చివరలో ఉన్న గుడ్లగూబ కూడా సామీ నన్ను చూస్తేనే అసహ్యంగా అపశకునంలా భావిస్తారు...తల అటూ ఇటూ తిప్పుతూ కూర్చుంటాను..సరిగా కనపడదుకూడా కాబట్టి  జంతువులందరిలా నాక్కూడా 20 ఏళ్లు చాలు సామీ అనగానే  - అందుకోసం ఎదురుచూస్తూన్న మానవుడు - అదికూడా నాకే నాకే అనుకుంటూ 100 ఏళ్లూ పూర్తయ్యాయని తెగ సంబరపడ్డాడు.*

*అందుకే:*

*మానవుడు తన మొదటి 40 ఏళ్లు మానవుడి గా బతుకుతాడు.*

*ఆ తరువాత 20 ఏళ్లు ఎద్దు నుండి తీసుకున్న కారణంగా   మానవుడు తన 40-60 ఏళ్ల మధ్యలో ఒక ఎద్దు లా కష్టపడుతూ పిల్లల్ని చదివించి, పెళ్ళిళ్ళు చేసి, ఇల్లు కట్టుకోవడం చేస్తూంటాడు.*

*ఇక ఆ తర్వాత 20 ఏళ్లు కుక్క నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 60-80 ఏళ్ల మధ్యలో తన ఇంటికి తనే ఓ* *కాపలాదారుగా మారిపోయి*

*వచ్చి వెళ్ళే వాళ్ళ ఆరా తీసుకుంటూ,  కోడుకు, కోడలు , మనవలు ఇచ్చే ఆర్డర్లు తీసుకొంటూ కాలక్షేపం చేస్తోంటాడు.*

*ఇక చివరి 20 ఏళ్లు గుడ్లగూబ నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 80-100 ఏళ్ల మధ్యలో ఎప్పుడు ఈలోకం నుంచి వెళిపోతాడోనని ఇంట్లో వాళ్ళు ఇతగాడికి ప్రొమోషన్ ఇచ్చి ఇతని మకాం వరండాలోకి మార్చిన కారణంగా... పాపం ఆ కుక్కిమంచంలోనే అన్నీ కానిస్తూ, కనపడక పోయినా గుడ్లగూబ లా తల ఇటూ అటూ తిప్పుతూ  ఆ దేవుడి పిలపుకై ఎదురు చూస్తూ ఉంటాడు.*

*"ఇదే మానవుల నూరేళ్ళ చరిత్ర".*

*మళ్ళీ ఆ మానవుడే అంటాడు : దురాశ దుఃఖానికి చేటని - దేవుడు ఇచ్చిన దానికంటే అతిగా ఆశపడకూడదని.*

 

9, డిసెంబర్ 2020, బుధవారం

జననికి ప్రణతుల్ 🙏 .

 


ఘనముగ భూమికి బుట్టెను ,

జనకుని గారాలపట్టి స్థానము గనియెన్ ,

యినకుల తిలకుని బొందెను ,

జనజగతికి తల్లియయ్యె , జననికి ప్రణతుల్ 🙏 .

8, డిసెంబర్ 2020, మంగళవారం

అచ్చమైన పొడుపు కథ.!

 

ఇది ప్రౌఢరాయల ఆస్థాన కవి ఎవరో రచించి ఉంటారు. ఎనిమిది ప్రశ్నలు?

వాటికి జవాబులు ఈ చాటువులో కవి పొందుపరచాడు.

ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ.

.

“ రాముడెవ్వానితో రావణు మర్దించె? 

పర వాసు దేవుని పట్నమేది ? 

రాజమన్నారుచే రంజిల్లు శరమేది ? 

వెలయ నిమ్మ పండు విత్తునేది? 

అల రంభ కొప్పులో అలరు పూదండేది? 

సభవారి నవ్వించు జాణ యెవడు? 

సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది? 

శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు? 

.

అన్నిటను జూడ ఐదేసి యక్షరములు 

ఈవ లావాల జూచిన నేక విధము 

చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి” 

లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !”

.

పై పద్యంలో మొదటి ఎనిమిది పాదాలు ప్రశ్నలు. 

తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు.(క్లూస్) 

మూడవ పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని “ భావజ్ఞ చక్రవర్తి” అని పిలవాలని, 

నాల్గవ పాదం ప్రౌఢరాయల! సంబోధన.

ఇక జవాబుల సూచికలు-

ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి,

ముందునుంచి వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి. (ఉదా;- “ కిటికి”వలె ).

1.రాముడు ఎవరిసాహాయంతో రావణుని చంపాడు?

2.వాసుదేవుని పట్నం పేరు ఏమిటి?

3.రాజమన్నారు అనే రాజు చేతిలో బాణం ఎమిటి?(శరము=బాణము)

4. నిమ్మ పండు విత్తనం పేరు ఏది?

5.రంభ జడలో పెట్టుకొన్న పూలదండ పేరు?

6.సభలో నవ్వించే కవిపేరు ఏది?

7.సీత పెండ్లికి సుల్కంగా పెట్టిన విల్లు ఏది? ( ఓలి=శుల్కం)

8.శ్రీకృష్ణుడు ఎవరి యింట పెరిగేడు?

 జవాబులు ఐదు అక్షరాలతో, ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటాయి. 

అదే ఈ చాటు పద్యంలోని చమత్కారం. ఇట్టి చాటువుల ద్వారా భాషా జ్ఞానం, పద జ్ఞానం వృద్ది చెందుతాయి. ఇలాంటివి ఇంకా చదవాలని కుతూహలం పెంచుతాయి.

పెద్దలు చదివి, పిల్లలకి కూడా తెలపగలరు.

6, డిసెంబర్ 2020, ఆదివారం

చూపు దిప్పుకోనగున .....

 


చూపు దిప్పుకోనగున ఈశోభనంపు

మాధురీ మనోఙ్ఞతలకు ,  మదను డలిగి

పుడమి సరసుల డెందాల కడిది జీల్చ

వింటి కెక్కుబెట్టిన వాడి విశిఖ మేమొ !


5, డిసెంబర్ 2020, శనివారం

ఎవరు గొప్ప ?

 


నడుము వంచలేక  నయగారములువోవ

పాదపూజ సేయు భార్య ఘనమ ?

స్టూలు నెక్కి పదము లాలి కందించుచు

పాదపూజ లందు భర్త ఘనమ ?


3, డిసెంబర్ 2020, గురువారం

ఎవ్వరినీ లోకువ చేయ తగదు


మేమంతా ఉన్నతులం

భూమినిగల తక్కినోళ్ళు పోలరు మాతో

ఈ మాది రహంకారులు

ధీమంతులుకారు , తీరు తీరుల నీచుల్ .


రాయంచ అందచందము

గాయని కోకిలకు లేదుగానీ, గళమం

దాయమ తీయందనములు

రాయంచకు రావు తాను రాయిడివడినన్ .


కోకిల గళ మాధుర్యము

కాకికి లే , దైన కాకి ఘనమాతృత్వం

కోకిలకు రాదు , ఘనతల్

లోకంబున వివిధగతులు , లోకువ లేలా ?

2, డిసెంబర్ 2020, బుధవారం

ముద్దుగుమ్మలు .....

 


రమణీయ మోహన రాజీవలోచనల్

శ్రీకృష్ణ వ్రతమాచరించ జనిరి

ముద్దుగుమ్మలు కాస్త ప్రొద్దుండగా లేచి

రందర బిలుచుక మందగమన

ఘన తనూభారాలస నడల బెడగున

యమునకు జనిరి సోయగము మెరయ

డెందాల నిండార అందాల పరమాత్మ

నిలిపి గ్రుంకులిడిరి నెలతులెల్ల


పరమ పురుష ! కృష్ణ ! తిరుమంగళాకార !

జన్మ జన్మ లందు జలజనేత్ర !

వలపులు గురిపించు చెలిమికాడవు గాగ

వరము నిమ్మ టంచు ప్రణతు లిడిరి .

29, నవంబర్ 2020, ఆదివారం

ఈ తాటిచె ట్టెట్టి పుణ్యాలన్ జేసెనొ .....

 


ఈలావణ్య తనూవిభావరులనెందే గంటిమా? రంగు- రూ

పీ లాగెట్లు మిళిందమై యొనరె ! తన్వీ ! రా యిటన్, మోహనా

లేలా?నీ వరచాటు చేసెద , వహో! ఈ తాటి చెట్టెట్టి పు

ణ్యాలన్ జేసెనొ నీదు పొందు గనె , కన్యాలింగనా జేతయై .

25, నవంబర్ 2020, బుధవారం

చూడవమ్మ ! యశోదమ్మ !

 


చూడ చిత్రంబు చిత్రము , దూడ యొకట ,

కృష్ణుడొక్కట , గోవుచన్ కేసి కుడుచు ,

ఆల పాలన్న పరమాత్మ కమృతము గద !

చూడవమ్మ! యశోదమ్మ! సుతుని విథము .

20, నవంబర్ 2020, శుక్రవారం

కైమోడ్పులు

 


పదపడి కళ్ళెముంభిగిచి పళ్ళకు మధ్యన , రెండుచేతులన్

బొదివి మహోగ్ర ఖడ్గములు , మూపుకు బిడ్డడి గట్టి , స్వారియై

పది పదునైదు రక్షకులు ప్రక్కగమించగ  , రౌద్రమూర్తియై

కదిలెను ఝాన్సిలక్ష్మి యలుకన్ దునుమాడగ నాంగ్లసేనలన్ .


కత్తుల రెండుచేతులను కంఠములన్ తెగగోసె శత్రులన్

బిత్తరచూపులన్ రిపులు భీతిలి రాయమ వీరవిక్రమో

న్మత్తత జూచి , మోసపు సమాయతనంబున నొంటె సైన్యమున్

క్రొత్తగ దింపి వెన్క కడ కూడి తటాలున దాడిసేయగా


కలవరపాటునంద , వెనుకన్ ఛురకత్తియ వీపులోదిగెన్

నెలతకు , వెంటవెంటనె ఘణిల్లున గుండుదిగెన్ , హయమ్ము వె

ల్వెలవడె , నింతలో గదిసి పెల్లుగ శత్రులు కత్తివ్రేటులన్

దలగిరి శీర్షమున్, చివరిదాకను పోరెను నెత్తురోడుచున్ .


ప్రధమ స్వాతంత్ర్యసంగ్రామ యోధురాలు

రాణి ఝాన్సిలక్ష్మీయె , చిరస్మరణగ

భరత భూమి దలచు దేశభక్తురాలు

భక్తి  కైమోడ్చి ప్రణమిల్లి  🙏 ప్రణతు లిడుదు .

19, నవంబర్ 2020, గురువారం

ఈ రోజు .....

 

ఈరోజు అంతర్జాతీయ 'పురుష' దినోత్సవం అట !

ఐనా ,


అమ్మే తొలిప్రాధాన్యత ,

ఇమ్ముగ పరమేశ్వరుడు మహేశ్వరి పిదపే ,

నమ్మిన నిజమిది జగతిన్ ,

అమ్మకె పాదాభివందనము 🙏 లు యెపుడున్ .

నేడు అలివేలు మంగ జన్మదినం

 


తిరుచానూరున పద్మసారసభవా,దేవీ,మహాలక్ష్మి, మం

గ,రమావల్లభువేంకటేశ్వరుని తాన్కంజోత్పలత్పూజలన్

వరమాలల్ దిగవైచి కోరివలచెన్ వామాక్షి , నే డా పరే

శ్వరి జన్మించినరోజు మ్రొక్కులిడుచున్ ప్రార్ధింతు 🙏 కైమోడ్పులన్ .

16, నవంబర్ 2020, సోమవారం

శివుడు .....

 


మట్టి ప్రమిద దెచ్చి మహదేవు నర్చించి

ఆవు నెయ్యి వోసి అభవు నెదుట 

వత్తి వేసి శివుని వాకిట ప్రతి రోజు

దీప మిడుడు , జన్మ తేజరిల్లు .


మట్టి ప్రమిద లోన మరి కాను పించడు

నూనె లోన గనగ నోప మతని

ప్రత్తి లోను దాని వత్తిలో గనరాని

శివుడు దివ్వె లోన చేరియుండు


అరుదైన అలంకారం .....

 


పండరి పురంలో  శివాజీ సమర్పించిన అరుదైన

ఆభరణాలతో రుక్మిణీ అమ్మవారి అపురూప వైభవం

              -----

కాసులపేరులు కంఠహారాలతో

మెరయు విఠ్ఠలుని రుక్మిణిని గనుడు

మరకత మణిమయ మంగళాభరణాల

కాంతమత్ మూర్తి శ్రీకాంత గనుడు

కటివలయ విలాస కమనీయ రత్నాభ

రణ హేలల వెలుంగు రమణి గనుడు

పసిడిపచ్చల భూషణసిరుల కరపాద

కమనీయమూర్తి శ్రీకమల గనుడు


ఛత్రపతి శివాజి సభక్తి సమధికముగ

తగ సమర్పించినవి యరుదైన నగలు

కనులు చాలవు రుక్మిణీ ఘనవిభవము

చూడ సర్వాంగభూషిత  శోభనములు .

15, నవంబర్ 2020, ఆదివారం

ఫలముల్ మెక్కెడివారు .....



 


ఫలము ల్మెక్కెడివారు తత్ఫల రసాస్వాదక్రియాలోలురై

పలుమా ఱమ్మధురత్వము న్నుతుల సంభావింతురేగాని, త

త్ఫల హేతుక్రమవృక్షముం దలపరెవ్వారైన, నట్లే రమా

కలితు ల్భోగములన్‌ భుజించుచు నినుం గన్నెత్తియుంజూతురే?

     ----- కవికోకిల దువ్వూరు . రామిరెడ్డి

               కృషీవలుడు నుండి


13, నవంబర్ 2020, శుక్రవారం

ఎలా జీవిస్తే , జీవితం సార్థకమౌతుందో .....

 


గుడి అవసరం లేని దేవుళ్ళు !!!!!!🙏

-------------------------

కొందరు దేవుళ్ళకు గుడులు అవసరంలేదు , పేదలగుండెలే గర్భగుడులు.

వీరిద్దరు డాక్టర్లు అంటే మీరు నమ్ముతారా? 

కానీ అదే నిజం. వీళ్లు ఎందుకు ఇలా ఉన్నారో మీరే చదవండి. 

వీళ్ళిద్దరూ డాక్టర్లు. మామూలు డాక్టర్లు కాదు , ఆయన MBBS & MD ,  ఆమె  MBBS. వ్యాసం చదవడం పూర్తీ అయ్యాక , వీళ్ళిద్దరికీ దండం పెట్టుకోవాలి అనిపించే విధంగా వున్న వీళ్ళ జీవితాన్ని ఇపుడు చదవండి. 

1985 లో నాసిక్ [ మహరాష్ట్ర] రైల్వే విభాగంలో పనిచేస్తున్న శ్రీ బావూరావ్ కోళే చాలా సంతోషంగావున్నారు. ఎందుకంటే ఆయన కొడుకు రవీంద్ర ,  MBBS పూర్తీ చేసి ఇంటికొస్తున్నాడు. ఆయన వంశంలో మొదటి డాక్టరు కాబోతున్నాడు. కానీ ఆయనకు తెలియదు రవీంద్ర పూర్తీగా వేరే జీవితం ఎన్నుకొన్నాడని. MBBS చివరిరోజుల్లో ఒక వ్యాసం , ఒక పుస్తకం రవీంద్రను మార్చేసాయి. వ్యాసం వ్రాసింది మహాత్మా గాంధి. అందులో ఆయన ఇలా అన్నారు : '' ఈ దేశపు పేద , దళిత కోటి ప్రజల హృదయాలనుండి స్రవించిన రక్తం తో పెంచబడి , విద్యాబుద్ధులు గడించి వారిగురించి తలవనైనా తలవని ప్రతి వ్యక్తీ దేశద్రోహియే '' అని మనకు వివేకానందుడు చెప్పలేదా ? '' వివేకానంద , గాంధీ , వినోబా భావేల జీవితాలు , ఆదర్శాలు , ఆశయాలు రవీంద్రను విపరీతంగా ఆకర్షించాయి, ప్రేరణను ఇచ్చాయి.


ఇంటికొచ్చాడు. తల్లితండ్రులతో '' నేను మారుమూల పల్లెల్లోని పేదలను డాక్టరు గా సేవించేందుకు వెళతాను.'' తండ్రి ఆనందం ఆవిరి అయ్యింది. తల్లి సమాధానం మౌనం అయ్యింది. డా.రవీంద్ర,  మహరాష్ట్ర లో అత్యంత వెనుకబడిన  అయిన మేల్ఘాట్ లోని బైరాఘర్ గ్రామాన్ని ఎన్నుకొన్నాడు. అదే ఎందుకు ? దానికి కారణం MBBS సమయంలో ఆయన చదివిన ఒక పుస్తకం. దానీ పేరు  Where There Is No Doctor.  వ్రాసినది David Werner. ఆపుస్తకం కవర్ పేజీ మీద ఒక రోగిని నలుగురు ఒక నులకమంచం మీద పెట్టుకొని తీసుకెళుతూవుంటారు. ఆ ఫోటో పక్కన చిన్నగా  Hospital 30 kms away అని వ్రాసివుంటుంది. ఆ దృశ్యం రవీంద్రను కదిలించివుంటూంది. అలా వైద్య సౌకర్యాలు ఏవీ లేని ఒక నిరుపేదల గ్రామానికివెళ్ళి వాళ్ళకు సహాయపడాలని ఆనాడే ఆయన అనుకొన్నాడు. తరువాత తన ప్రొఫెసర్ దగ్గరికెళ్ళి అలాంటి చోట ఎలా పనిచేయాలో చెప్పమన్నాడు. అపుడు ప్రొ. జూజు అనే ఆయన అలాంటి చోట పనిచేయాలంటే నీకు 3 విషయాలు బాగా తెలిసివుండాలి : 1.) Sonography or Blood Transfusion  లేకుండానే గర్భిణి స్త్రీలకు ప్రసవం చేయగలగడం , 2.) X-ray లేకుండా న్యుమోనియా కు వైద్యం చేయడం , 3.) డైయోరియా కు వైద్యం చేయడం. 


ఆరు నెలలు ముంబాయి లోవుండి వాటిని నేర్చుకొన్నాడు రవీంద్ర. వెంటనే బైరాఘర్ కు వచ్చాడు. ఆ పల్లెకు బస్సులు లేవు. అమరావతి [ మహరాష్ట్ర] నుండి 40 కి.మి. నడచివెళ్ళాలి. అలాగే వచ్చాడు అతను. అక్కడే చిన్న గుడిశె వేసుకొని అక్కడి రోగులకు వైద్యం చేసేవాడు. ఆ పల్లె పేదరికం , నిరక్షరాస్యత ,  వ్యాధులతో నిండివుంది. ఒక్కడే అంతమందిని సేవించడం కష్టమనిపించింది. తనకు ఒక తోడు వుంటే బాగుంటుందని భావించి దినపత్రికలో పెళ్ళి ప్రకటన ఇచ్చాడు. డాక్టరు అయిన యువతి కావాలని. కానీ ఆయన 4 షరతులు పెట్టాడు. వాటికి ఒప్పుకొన్న యువతినే తాను పెళ్ళిచేసుకొంటాను అని. 1.)40 కి.మీ. నడవగలగాలి. 2.)5 రూపాయల పెళ్ళికి ఒప్పుకోవాలి. [ 1989 లో రిజిస్టరు పెళ్ళికి ఫీజు అట అది ] 3.)కేవలం 400 వందరూపాయలతో నెల పొడుగునా జీవనం చేయగలగాలి. [ ఎందుకంటే డా. రవీంద్ర నెలకు 400 మంది రోగులకు వైద్యం చేస్తాడు. ఒక రోగి నుండి కేవలం ఒక రూపాయి తీసుకొంటాడు ] 4)అవసరమైతే  ప్రజలకోసం భిక్షమెత్తడానికైనా సిద్ధంగా వుండాలి.  100 సంబంధాలు వచ్చినా , ఈ షరతులు చూసాక 99 మంది వెళ్ళిపోయారు. ఒక యువతి సరేనంది. ఆమె పేరు డా. స్మిత [ ఫోటో లో వున్న వ్యక్తి]  

1991 లో డా. స్మిత ప్రసవ సమయంలో స్వయంగా తానే వైద్యం చేస్తాను అన్నాడు డా. రవీంద్ర. కానీ ఆమెకు తీవ్రమైన సమస్యలు వచ్చాయి. ఆ పల్లె ప్రజలు ఆమెను నగరం తీసుకెళ్ళండి అని కూడా చెప్పారు. ఆమెను అడిగితే ' మీ ఇష్టం ' అంది. '' ఒకవేళ నేను ఈమెను నగరం తీసుకెళితే , ఇక నేను తిరిగిరాను. మీకు లేని సౌకర్యాలు మేము అనుభవించడం మాకు ఇష్టం లేదు '' అని పల్లెప్రజలకు చెప్పాడు. డా. స్మిత '' మీరే నాకు వైద్యం చేయండి , నగరం వద్దు , '' అనింది. ఆయనే వైద్యం చేసాడు. ప్రసవం జరిగింది. అబ్బాయి జన్మించాడు. ఆ దంపతుల త్యాగం ఆ మట్టిమనుషుల మనసులను కదిలించింది. వాళ్ళకు ఆ యువ దంపతులు  ఆది దంపతుల్లాగా లాగా కనిపించారు. 

నెమ్మదిగా ప్రజలు వీరిద్దరినీ నమ్మడం మొదలుపెట్టారు. ఏడాది లో ఒక నాలుగు నెలలు మాత్రం పొలం పని ఉంటుంది. మిగిలిన సమయమంతా పనివుండదు. కాబట్టి ఆహారం కొరత , డబ్బు కొరత ,  దాని కారణంగా రకరకాల వ్యాధులు.  ఆ పల్లె వాళ్ళకు ఒంటి మీద సరిగా గుడ్డలు కూడా వుండవు , అందుకే వాళ్ళకు న్యుమోనియా లాంటి జబ్బులు సర్వసాధారణంగా వస్తుండేవి. దంపతులిద్దరూ ఆలోచించి , ఈ పరిస్థితి మారాలంటే వీళ్ళకు ఆర్థిక వనరులు ఏర్పడాలి. అంటే వీళ్ళకు అవసరమైన తిండిగింజలు వీళ్ళే పండించుకోవాలి. అందుకోసమని డా. రవీంద్ర నగరంలోవుంటున్న ఒక వ్యవసాయ సైంటిస్టు స్నేహితుడితో సలహాలు తీసుకొని , విత్తనాల మీద అధ్యయనం చేసి తానే స్వయంగా  క్రిమి , కీటకాలను ఎదుర్కొనగలిగే కొత్త , ఆరోగ్యవంతమైన విత్తనం రకాన్ని కనుక్కొన్నాడు. దాన్ని సాగుచేద్దామంటే ప్రజలకు నమ్మకంలేదు. అందుకే తన కొడుకును '' నీవు నగరం లో పై చదువులు వదులుకొని ఒక రైతు కాలేవా ? '' అని అడిగితే '' అలాగే , మీరు ఎలా అంటే అలా, '' అన్నాడు కొడుకు రోహిత్. అపుడు ముగ్గురూ కలిసి తామే స్వయంగా ఒక చోట భూమి దున్నితాము తయారుచేసుకొన్న విత్తనాలను నాటి , చక్కటి పంట తీసి పల్లె వాసులకు చూపించారు. అది వాళ్ళను విశేషంగా ఆకర్షించింది. అందరూ ఆ విత్తనాలను వాడటం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులను తెలుసుకొని , వాళ్ళను హెచ్చరిస్తూ పంట నష్టం కాకుండా చేస్తాడు డా. రవీంద్ర. ఆ తరువాత పండిన పంటను ప్రజా పంపిణి వ్యవస్థ [ Public Distribution System] ద్వారా అందరి ఇళ్ళలో తిండి గింజలు నిలువ వుండేలాగా చేసారు.ఇపుడు తిండికి లోటుండదు , రెండుపూటలా తిండి  కారణంగా , ఆడవాళ్ళకు ఆరోగ్యం మెరుగయ్యింది. గతంలో పుట్టిన 1000 మంది పిల్లల్లో 200 మంది మరణిస్తుంటే  ఇపుడు ఆ సంఖ్య 60 కి తగ్గింది. పల్లె లో వచ్చిన మార్పు వింటే మనం ఆశ్ఛర్యపోతాం. నగరం లో IIT చదివి ఒక కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండిన యువతీ యువకులు ఏడాది కి సంపాదించే డబ్బుకు సమానంగా ఒక్కో రైతు సంపాదిస్తున్నాడు. 300 కుటుంబాలున్న ఆ పల్లె ఇపుడు చుట్టుపక్కల పల్లెలను కూడా పోషించే స్థాయికి ఎదిగింది. 

ప్రపంచంతో సంబంధాల్లేకుండా వుండిన ఆ పల్లె లో వస్తున్న కొత్త ప్రపంచపు వెలుగులు చూసాక మహరాష్ట్ర ప్రభుత్వపు మంత్రి [ గతంలో - ఇపుడు కాదు ] ఆ పల్లెకు వచ్చాడు. ఆయన డా. రవీంద్ర , డా. స్మిత , వాళ్ళ కుమారుడు రోహిత్ లు చేస్తున్న పని చూసి చాలా సంతోషించి , '' మీరున్న ఈ చిన్న గుడిశె మీకు తగిన స్థలం కాదు. నేను మీకు ఒక పెద్ద పక్కా ఇల్లు కట్టిస్తాను '' అంటే అందుకు వాళ్ళు అన్నారు : '' మాకు ఇదే చాలు , కానీ ఈ పల్లె ఇతర ప్రదేశాలతో కలిసేవిధంగాను , పల్లె లోపలానూ రోడ్లు వేయించండి.'' సరే అన్నాడు మంత్రి. ఇపుడు ఆ పల్లెకు చక్కటి రోడ్లున్నాయి , ఆ పల్లె ఆధారంగా నడిచే 6 పాఠశాలున్నాయి , 12 వైద్యకేంద్రాలున్నాయి. కానీ సర్జరీ లు చేసే డాక్టరు కావాల్సివచ్చింది. అపుడు డా. రవీంద్ర తన రెండవకొడుకు రాం ను సర్జన్ కమ్మని ప్రోత్సహించాడు. అతను అది పూర్తీ చేసి ఇపుడు ఆ ప్రాంతంలో వైద్యసేవలు అందిస్తున్నాడు.

మన ఇళ్ళలో , పాఠశాలల్లో , కళాశాలల్లో ఇటువంటి మనుషుల గురించి పిల్లలకు చెప్పాలి. మామూలుగా కాదు , హృదయానికి హత్తుకొనేలాగ చెప్పాలి. అప్పుడే తరాలను నడిపించే వ్యక్తులు తరగతి గదుల్లో తయారౌతారు.వీరి గురించి వెలుగులోకి తెచ్చిన మహానుభావులకు నా హృదయ పూర్వక అభినందనలు .సామాజిక మాధ్యమం లో పోస్ట్ చేస్తే అందరూ తెలుసుకుంటారన్న చిరు ఆశ నాది .

డా .వసుంధర

🙏

దీపావళి శుభాకాంక్షలు




పార్వతీ పరమశి వానందలహరిలో
తడిసిన నానేల ధన్యతమము
సీతా రఘుపతీ విశిష్ట పాదాంబుజ
ముద్రితం నానేల మోక్ష పథము
రాధికాకృష్ణుల రాగహేళల ప్రేమ
లొలికిన నానేల యోగభూమి
సాయి శ్రధ్ధాసబూరీయ మార్గాలలో
నడచిన నానేల నందమయము

తీరుతీరుల నానేల దివ్యమయము
నాదు భరత భూమాతృపుణ్యాలు జేసి
ఆయు రారోగ్య సౌభాగ్య శ్రీయుతమయి
పుడమి దీపావళీపర్వ ముదిత యగుత !

12, నవంబర్ 2020, గురువారం

పాదపూజ .....

 

ఓనమాల్ దిద్దించు నొజ్జకు మ్రొక్కుటే

పరమేశ్వరున కిడు పాద పూజ

ఆమ్మ , ఆవుల తోటి ‘ అఆ ‘ లు దిద్దుటే

పాలిచ్చు తల్లికి పాద పూజ

సుమతి , వేమన పద్య సూక్తులు పాడుటే

భాషా మతల్లికి పాద పూజ

తియ్య తియ్యగ నేర్చి తెలుగు మాటాడుటే

పంతులు గారికి పాద పూజ


మమ్మి డాడీలు కాదురా అమ్మ నాన్న ,

తెలుగు మాటాడ రాయంగ దివురు నాన్న!

తల్లిభాషను నేర్చి జోతలు ఘటిల్లి

పాడుటే నేలతల్లికి  పాదపూజ 🙏 .

11, నవంబర్ 2020, బుధవారం

జడ యల్లాడెడు .....

 


జడ యల్లాడెడు,జాజిపూతురుముతో ,జాల్వారు కుచ్చుల్లతో,

నడు మల్లాడెడు,మాయురే!పిడికెడై ,నాజూకు యొడ్డాణపుం

గుడుసై,ముందుకువెన్కకై యొడలు,సోకుల్ మాడ , చెంచెక్కలా

డెడు ఊపుల్,చెఱుకుంగడల్ బలెను,చేడెల్ ,చూడ కన్విందగున్ .

25, అక్టోబర్ 2020, ఆదివారం

మా తల్లి శ్రీపోలేరు పరమేశ్వరీ పరంజ్యోతికి దేవీనవరాత్రుల సంకీర్తన సంస్తుతి

 మా తల్లి శ్రీపోలేరు పరమేశ్వరీ పరంజ్యోతికి

దేవీనవరాత్రుల సంకీర్తన సంస్తుతి




తొలిరోజు ' శైలసుత ' యై

యలరారును దుర్గ , మా మహా పోలేర

మ్మ , లలిత , శాంకరి , శుభకరి ,

అలివేణికి 🙏 ప్రణతులిడుదు నమృతాంభసికిన్ .


రెండవ రోజున దుర్గా

చండిక పోలేరు ' బ్రహ్మచారిణి ' యనగా

దండ కమండల మాలా

మండిత తపమాచరించు మాతకు ప్రణతుల్ 🙏 .


మూడవరోజున ' అమ్మ ' ను

వేడుకగా ' చంద్రఘంట ' వేషధారి యనన్

వేడుకొని మ్రొక్కుకొందును ,

నీడగ పోలేరుతల్లి ! నిలుమమ్మ ! మదిన్ 🙏 .


నిండుగ మా తల్లియె బ్ర

హ్మాండము సృజియించుగాన , మరి చవితిని , ' కూ

ష్మాండాదుర్గ ' యనగ భూ

మండలమందువెలుగున్ , నమస్సులు 🙏 తల్లీ !


అయిదో రోజున దుర్గ  వి

జయంబగును  ' స్కందమాత ' సన్నుతనామా

భయహస్త మాతృమూర్తిగ ,

దయగల  పోలేరు  తల్లి ! దండాలమ్మా🙏  !


ఆరో రోజున దుర్గా

కారుణ్యామృతహృదయిని ' కాత్యాయని 'యై ,

చేరి వ్రతమాచరించిన

వారికి పోలేరుతల్లి వరముల నొసగున్ 🙏 .


' కాళరాత్రి ' దుర్గ  గాఢాంధకార వపుష ,

దుష్టసంహరణ , ప్రదోష శుభద ,

కడుభయంకర , శుభకర , సప్తమిని తల్లి ,

పుడమి తలను మోపి మ్రొక్కులిడుదు 🙏 .


అష్టమిని ' మహాగౌరి ' యై యలరు దుర్గ 

అమ్మలను గన్న మాయమ్మ అమృతవల్లి

తల్లి కుల్లూరుపోలేరు తరతరాల

మమ్ము కాపాడు , శిరసా నమామి 🙏 తల్లి !


' సిధ్ధిదాత్రి ' దుర్గ శ్రీమహాపోలేరు ,

సకల సిద్ధులనిడు శాంకరి , అమృ

తమయి , తొమ్మిదవ దిన మనోఙ్ఞరూపసి ,

తల్లి పదములంటి 🙏 తనియువాడ .

6, సెప్టెంబర్ 2020, ఆదివారం

తస్మై శ్రీ గురవే నమః

 తస్మై శ్రీ గురవే నమః

~~~~~~~~~~~


అది 1971 జూలై 29 .

సమయం సాయంత్రం నాలుగ్గంటలు .

జూనియర్ కాలేజి ప్రిన్సిపల్ గది .

కుర్చీలో తథేక ధ్యానంతో పనిలో నిమగ్నమై

ఒక ప్రసన్న గంభీర మూర్తి .

గుమ్మంలో ఇరవైయ్యేళ్ళ నూనూగు మీసాల

కుర్రాడు , రాజారావు – చేతిలో ఎప్పాయింట్ మెంట్

ఆర్డర్ తో

మే ఐ కమిన్ సార్

ప్రిన్స్పల్ సార్ తల కూడా పైకెత్తలేదు

కాస్తంత బిగ్గరగా మళ్ళీ మే ఐ కమిన్ సార్

ఈసారి సారు తల పైకెత్తేడు , ప్రశ్నార్థకంగా

నమస్తే సార్ , విష్ చేసి రాజారావు ఎప్పాయింట్ మెంట్

లెటరు టేబిల్ మీదుంచేడు

మాకూ వచ్చింది , ఏం చదువుకున్నావ్

చెప్పేడు రాజారావు

ఎక్కడ

చెప్పేడు

ఓహో , తమరు అక్కడి సరుకా

.......... మౌనం

సబ్జెక్టేమైనా వచ్చా

.......... మళ్ళీ మౌనం

ఒకటి , రెండు , మూడు .....సబ్జెక్టుకు సంబందించిన

ప్రశ్నలు , శర పరంపరలుగా

ధాటిగా రాజారావు సమాధానాలు

ప్రిన్స్ పాల్ గారిలోని చులకన భావం కొంత తగ్గినట్లని

పిస్తోంది . ముఖం కాస్తంత ప్రసన్నంగా మారింది .

కాస్త సరుకుందనీ , పనికొస్తాడనీ భావించి నట్లుంది

అదే , ఆనాటి పెద్దల గొప్ప గుణం .

చిటికెలో పాలూ , నీళ్ళూ వేరు చేసేస్తారు

          ----------------

కాలింగ్ బెల్ మోగింది , అటెండర్ వచ్చాడు

సీనియర్ అసిస్టెంట్ ని పిలవమని ఆర్డర్

సీనియర్ అసిస్టెంట్ హాజరు

ఎప్పాయింట్ మెంట్ ఆర్డరిచ్చి  , రాజారావును జాయిన్

చేస్కోవలసిందిగా ఉత్తర్వు  

సీనియర్ అసిస్టెంట్ రాజారావును ఆఫీస్ రూం లోకి తీసుకెళ్ళేడు

మీ ఒరిజినల్స్ ఇవ్వండి

సార్ , ఈనెలలోనే రిజల్ట్సొచ్చాయి , ఒరిజినల్స్ త్వరలోనే అందజేస్తాను

సీనియర్ అసిస్టెంట్ ప్రిన్సిపల్ రూంలోకెళ్లేడు , రాజారావు ఫాలో అయ్యాడు

విషయం ప్రిన్సిపల్ కు విన్నవించ బడింది .

అలాగా , పర్లేదులే , జాయిన్ చేసుకోండి . యూనివర్సిటీకి

నేను రాసి తెప్పిస్తానులే .

సీనియర్ అసిస్టెంట్ మారు మాటాడకుండా జాయిన్ చేసుకున్నాడు

సదరు జూనియర్ కళాశాల అనుబంధ ఉన్నత పాఠశాలలో

రాజారావు ఉపాథ్యాయ వృత్తి మొదలయ్యింది .

             -------------

అప్పటి విద్యాలయాల మహోపాథ్యాయుల , ప్రథానోపాధ్యాయుల

వ్యక్తిత్వాలు మహోన్నతాలు . వారి నిర్వహణ సామర్థ్యం అద్భుతం .

వాళ్ళు రాగ ద్వేషాల కతీతులు . ఎవ్వరిలో ఏచిన్న సుగుణం కన్పించినా

మెచ్చుకుని ప్రోత్సహించే ఆ తత్త్వం ఇప్పటి వాళ్లలో మచ్చుకుకూడా కన్పించదు .

సమర్థతను గుర్తించడం , నిబధ్ధతకు పెద్ద పీట వెయ్యడం , తద్వారా

సంస్థను ముందుకు తీసుకెళ్లడం అప్పటి వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య .

ఇప్పుడు భజన పరులకు ప్రాధాన్యతనిస్తూ , సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు .


                ---------------

రాజారావుకు మొదట్నుంచీ అలాంటి మహోన్నత మూర్తుల సాహచర్యం ,

మార్గదర్శనం లభించింది . ఉపాథ్యాయ వృత్తిలో నిబధ్ధత , సబ్జెక్ట్ లో ప్రావీణ్యత

అలవడ్డవి . ప్రధానోపాధ్యాయులుగా సక్సెస్ సాధించడానికి బాటలు పడ్డవి .

తస్మై శ్రీ గురవే నమః

29, ఆగస్టు 2020, శనివారం

నేడు తెలుగుభాషాదినోత్సవం


 తిక్కనకున్ వేమనకున్
మ్రొక్కెద గురజాడ గిడుగు మొనగాళ్ళకు, నా
చక్కని తెనుగుకు మీగడ
చిక్కని రుచులద్ది సేవ జేసినవార్కిన్ .

జనబాహుళ్యపు నుడులకు
ఘన హిత మొహరించి నట్టి ఘనుడా ! గిడుగూ!
అనయము మిము స్మరియింతుము
ఘనముగ  , నీసంప్రదాయఘనులు వడంకన్ .

28, ఆగస్టు 2020, శుక్రవారం

తిప్పతీగ

 

Add caption

కణుపు కొక్క ఆకు కనువిందు సేయును

లేత పచ్చదనము లిగురులొత్తు

కంచెలందు పెరుగు ఘనభిషగ్వర్యులు

అమృతవల్లియండ్రు అది యిదియట .


రోగనిరోధకశక్తిని

బాగుగ సమకూర్చునంట పరగడుపుననే

తీగలరససేవనమున

వేగముగా శక్తివచ్చు వివరము దెలిసెన్ .


నెట్టు దెఱచిచూడ నిండుగా గలదందు

దీనిగూర్చి చదివి తెలుసుకొనుడు ,

తెలుగువారు దీన్ని తిప్పతీగ యనిరి

తెలిసిన విబుధులు తెలుపనగును .